హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): అనర్హులు ఉన్నారంటూ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఇచ్చిన సొమ్మును కేంద్రం వెనక్కి తీసుకుంటున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఎకరానికి రూ.2 వేల చొప్పున ఏటా మూడు దశల్లో రూ.6 వేలు ఇస్తూ.. అందులోనూ అనర్హులున్నారనే సాకుతో ఇచ్చిన సొమ్మును వాపస్ తీసుకొనే దుర్మార్గ ప్రభుత్వం మోదీదని ధ్వజమెత్తారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొన్న సొమ్ము కేంద్రానికి తిరిగి ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. పీఎం కిసాన్ నిధి ప్రారంభించిన తొలి విడతకు, ప్రస్తుత 11వ విడతకు మధ్య వ్యత్యాసం వెనుక కేంద్రం కోతలే నిదర్శనమని ఉదహరించారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీలో మండలి విప్ ఎమ్మెస్ ప్రభాకర్, ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం రైతుల ఉసురు తీస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం ఊపిరిపోస్తున్నదని చెప్పారు. రైతుబంధు స్ఫూర్తితో కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) ప్రారంభించినప్పుడు దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులను లెక్కగట్టి 11.84 కోట్ల మందికి వర్తింపజేశారని, ఆ సంఖ్య ఇప్పుడు 3.87 కోట్లకే పరిమితం చేశారని ఆధారాలతో సహా వివరించారు. 2019 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావటానికి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దశలవారీగా బీజేపీ నీరుగారుస్తున్నదని ఆరోపించారు.
రైతుల ఉద్యమాలకు మద్దతు
కుటుంబంలో ఒక్కరికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారని, ఇంట్లో ఉద్యోగం ఉన్నా, చిరు వ్యాపారాలు చేసుకునే వారిని జాబితా నుంచి తొలగిస్తున్నారని పల్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. 70 శాతం రైతులను అనర్హుల పేరుతో తొలగించారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా దేశంలో రూ.2 లక్షల కోట్లు ఇచ్చారని, అనర్హత సాకుతో ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించాలని కేంద్రం నిస్సిగ్గుగా కోరుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులు ఎక్కడ జమచేయాలనే విషయాన్ని కేంద్రం తన వెబ్సైట్లో పేర్కొన్న విషయాన్ని వెల్లడించారు. ఆ సొమ్మును రైతులు తిరిగి చెల్లించకూడదని పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లో రైతులు మోటర్లకు మీటర్లను వ్యతిరేకిస్తూ 14 జిల్లాల్లో ఉద్యమాన్ని చేపట్టారని, తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ కింద పొందిన సొమ్మును తిరిగి చెల్లించాలని కోరటంతో దేశ రైతాంగం మరో పోరాటానికి సిద్ధమవుతున్నదని చెప్పారు. ఈ పోరాటానికి తాము సంఘీభావం ప్రకటిస్తామని, మద్దతుగా నిలుస్తామని వెల్లడించారు. ఈ సారి రైతు ఉద్యమంతో మోదీ ప్రభుత్వానికి పలాయనం తప్పదని హెచ్చరించారు.
ఉసురు తీస్తున్న కేంద్రం
కేంద్రం అనుసరిస్తున్న వ్వవసాయ వ్యతిరేక విధానాలు రైతుల ఉసురు తీస్తున్నాయని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో తమ మరణానికి కారణం మోదీ విధానాలేనని రైతులు లేఖ రాసి, వీడియో తీసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ విధానాలతో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, అందుకు మహారాష్ట్ర ఉదాహరణ అని చెప్పారు. 8 ఏండ్లలో మహారాష్ట్రలో 1,800 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని వివరించారు.
ఊపిరి పోస్తున్న తెలంగాణ
మోదీ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తుంటే, రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఊపిరిపోసిందని పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. రైతుబంధు పథకం 2018లో ప్రారంభించినప్పుడు రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు 1 కోటి 30 లక్షల ఎకరాలకు రూ.5,236 కోట్లను పంపిణీ చేస్తే.. 10వ సీజన్లో 64 లక్షల 99 వేల మంది రైతులకు 1 కోటి 48 లక్షల 66 వేల ఎకరాలకు రూ.7,433 కోట్లను అందించిన ఘనత సీఎం కేసీఆర్దని చెప్పారు. ఉమ్మడిపాలనలో 2014నాటి ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,348 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు అనుకూల, వ్యవసాయ అనుకూల విధానాల ఫలితంగా ఆత్మహత్యలు గణనీయంగా(తాజా గణాంకాల ప్రకారం 352 మంది) తగ్గాయని వివరించారు. ఏ కారణంతో రైతు మరణించినా ప్రభుత్వం బీమాతో ధీమా కల్పిస్తున్నదని, 90 వేల మంది రైతు కుటుంబాలకు రైతుబీమా ద్వారా రూ.5 లక్షల చొప్పున సాయం అందించిందని గుర్తుచేశారు. 30 లక్షల మోటర్లకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని, నీటి తీరువా రద్దుచేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల విధానాలతో 2014లో 24 లక్షల టన్నులున్న వరి దిగుబడి, ప్రస్తుతం 142 లక్షల టన్నులకు చేరిందని వివరించారు.
ఈడీ, ఐటీలకు బెదిరేది లేదు
ఈడీ, ఐటీ, సీబీఐ.. దేనికీ బెదిరేది లేదని పల్లా రాజేశ్వర్రెడ్డి తేల్చిచెప్పారు. రాజ్యాంగబద్ధ సంస్థలను పార్టీ అనుబంధ సంఘాలుగా బీజేపీ వాడుకుంటున్నదనే విషయం దేశానికి తెలుసని పేర్కొన్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీ పేర్లతో సోదాలు మొదలయ్యాయని చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 వేల మందిపై ఈడీ కేసులు పెడితే, భయపడి 3,900 మంది బీజేపీలో చేరారని, వారిపై చర్యలు లేవని తెలిపారు. బీజేపీలో చేరబోమని, ఆ పార్టీ విధానాలపై తిరుగుబాటు చేసేవారినే దర్యాప్తు సంస్థలతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రంకు రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ గురించి మాట్లాడితే సమయం వృథా అన్నారు. అప్రజాస్వామిక బీజేపీపై రాహుల్గాంధీ పోరా టం చేయాల్సింది పోయి, టైంపాస్ యాత్ర చేస్తున్నారని ఎద్దేవాచేశారు.