హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పిందే నిజమవుతున్నది. ఆయన చెప్పినట్టుగానే డిస్కంల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో పావును కదుపుతున్నది. దీంతో ఇప్పటికే పలు రాష్ర్టాల్లో లక్షల స్మార్ట్ మీటర్లను బిగించారు. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 2.85 కోట్ల స్మార్ట్ మీటర్ల సరఫరాకు టెండర్లను ఆహ్వానించారు. రూ.23 వేల కోట్ల విలువైన పనులకు అదానీ ట్రాన్స్మిషన్, జీఎమ్మార్, ఎల్అండ్టీ, ఇంటెల్లిస్మార్ట్ కంపెనీలు బిడ్లు వేశాయి. ఈ టెండర్లను దక్కించుకొన్న కంపెనీలకు స్మార్ట్ మీటర్లను బిగించే బాధ్యతతోపాటు ఇతర అధికారాలను కూడా కట్టబెట్టారు. ఎవరు ఎంత విద్యుత్తును వాడుతున్నారనే డాటాను సేకరించి బిల్లులు వేయడంతోపాటు క్లౌడ్, కమ్యూనికేషన్ సేవలను కూడా ఈ కంపెనీలే నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి డిస్కంల అధికారాలను క్రమంగా ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. అదానీ కంపెనీ ఇప్పటికే ముంబైలో 10.8 లక్షల స్మార్ట్ మీటర్ల సరఫరాకు టెండర్ను దక్కించుకొన్నది.
ఇటీవల యూపీలో బాయిల కాడ పెట్టిన స్మార్ట్మీటర్లను తొలగించి కరెంటు ఆఫీసు వద్ద పారేసి నిరసన తెలుపుతున్న రైతులు
దేశ వ్యాప్తంగా..
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే వివిధ రాష్ర్టాల్లో దాదాపు 50 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించారు. వీటిలో అత్యధిక మీటర్లను ఉత్తరప్రదేశ్లో అమర్చారు. ఆ తర్వాతి స్థానాల్లో బీహార్, రాజస్థాన్, హర్యానా, అస్సాం, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, తమిళనాడు, జమ్ముకశ్మీర్ రాష్ర్టాలు ఉన్నాయి. డిస్కంల ప్రైవేటీకరణను దేశంలోని విద్యుత్తు ఉద్యోగులంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నప్పటికీ నరేంద్రమోదీ సర్కార్ మొండిగా ముందడుగు వేస్తున్నది. దీన్ని తెలంగాణ లాంటి కొన్ని రాష్ర్టాలు మాత్రమే మొదటి నుంచి ఎండగడుతున్నాయి. ‘నా కంఠంలో ప్రాణమున్నంత వరకు మోటర్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకోను’ అని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడం లేదంటూ బీజేపీ నేతలు తప్పించుకోజూస్తున్నారు.
రూ.3,03,758 కోట్లతో ఆర్డీఎస్ఎస్
డిస్కంల పరిధిలో విద్యుత్తు సరఫరాను మరింత మెరుగుపరుస్తామని చెప్తూ ప్రధాని మోదీ ఈ ఏడాది జూలై 30న రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)ను ప్రారంభించిన విషయం విధితమే. ఐదేండ్ల పాటు (2023-28 వరకు) కొనసాగే ఈ పథకానికి కేంద్రం రూ.3,03,758 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 25 కోట్ల సాధారణ విద్యుత్తు మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లను బిగించాలని లక్ష్యంగా నిర్ణయించారు. తొలి విడతగా డిస్కంలకు అత్యధిక నష్టాలు వస్తున్న ప్రాంతాల్లో 10 కోట్ల మీటర్లను మార్చనున్నారు. ఇదంతా 2023 నాటికి పూర్తి చేస్తారు. మిగిలిన మీటర్లను రెండో విడతలో 2025 నాటికి మార్చేందుకు ప్రణాళిక వేశారు.