సాగు మోటర్లకు విద్యుత్తు మీటర్లు
రైతుల చేతుల్లో వేలకు వేల బిల్లులు
కట్టబోమంటే కరెంటు కనెక్షన్ ఉండదని హెచ్చరికలు
రైతుల గుండెల్లో బీజేపీ కత్తి పోట్లు
బిల్లుకు ఓకే చెప్తే మన రైతన్నల పరిస్థితీ ఇదే!
హైదరాబాద్, ఫిబ్రవరి 13: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్మీట్లో ఏపీలోని శ్రీకాకుళం గురించి చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతున్నది? అంటే.. ఈ ఒక్క ఫొటో కేంద్రం దుర్బుద్ధిని తెలుపుతుంది. ఈ ఒక్క ఫొటో రైతుల దుస్థితిని సూచిస్తుంది. ఈ ఒక్క ఫొటో కేసీఆర్ విద్యుత్తు సవరణ బిల్లు ఎందుకు వద్దంటున్నరో చెప్తుంది. ఈ ఒక్క ఫొటో బీజేపీ అబద్ధాలను ఎత్తిచూపుతుంది. అవును! శ్రీకాకుళం రైతుల మెడకు కత్తి పెట్టి, విద్యుత్తు బిల్లులను వసూలు చేస్తున్నదీ కేంద్ర ప్రభుత్వం. ఇదంతా ఏంటి? అనేగా ప్రశ్న.
జరిగిందిదీ: కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో ఏపీలోని జగన్ సర్కారు వ్యవసాయ మోటర్లకు కరెంటు మీటర్లు బిగించటానికి అంగీకరిస్తూ 2020 సెప్టెంబర్ 3న క్యాబినెట్లో నిర్ణయం తీసుకొన్నది. పైలట్ ప్రాజెక్టుగా మొదట శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు బిగిస్తామని చెప్పి పని కూడా ప్రారంభించింది. ప్రకాశం జిల్లాలోనూ అమలుకు కసరత్తు మొదలైంది.
ఇప్పుడేం జరుగుతున్నది: శ్రీకాకుళంలోని ప్రతి వ్యవసాయ బావి దగ్గర కరెంటు మీటర్లు వెలిశాయి. ఆ మీటర్లకు ప్రతి నెలా రీడింగులు కూడా తీస్తున్నారు. ఆ బిల్లులను రైతుల చేతుల్లో పెడుతున్నారు. ఆ బిల్లు చూడగానే రైతు గుండె దడదడలాడుతున్నది. ఒకప్పుడు ఉచిత కరెంటును అందుకొన్న రైతులు.. వేలకు వేల బిల్లులు చూసి అవాక్కవుతున్నారు. కట్టబోం అంటే కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఎంత దగా.. ఎంత మోసం.. అని కేంద్రం, బీజేపీపై ఆ జిల్లా రైతులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మా గుండెల్లో మీ‘డర్’
వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు ఇస్తామని చెప్పిన పాలకులు ఇప్పుడు మోటర్లకు మీటర్లు బిగిస్తున్నారు. ఇన్నేండ్లు బిల్లుల సమస్య లేనేలేదు. మీటర్లు బిగించి బిల్లులు కట్టుమంటే రైతుల పరిస్థితి ఏంటి? అసలే అరకొర విద్యుత్తు సరఫరాతో అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా ఉన్నది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి మరింత ఆందోళనకు గురిచేస్తున్నారు.
– రైతు కర్నే అప్పలనాయుడు, పారాపురం, శ్రీకాకుళం