Minister Niranjan Reddy | గత ప్రభుత్వాలు దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ వచ్చాయని.. మోదీ సర్కారు మాత్రం కోత విధించిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందూ గార్డెన్స్లో మంగళవారం నిర్వహించిన విశ్వ ఆగ్రోస్ మార్క్ఫెడ్ గోల్డ్ కార్యక్రమాన్ని మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మార్క్ఫెడ్ సభ్యుడు విజయ్కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని రైతులకు అందిస్తున్న ఎరువుల సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పాత్ర శూన్యమన్నారు. కిషన్రెడ్డి ఎరువుల సబ్సిడీ, ఫసల్ బీమాపై మాటలు అమాయకంగా ఉన్నాయని, కేంద్రానికి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఉండవని, రాష్ట్రాల ఆదాయం మీదనే కేంద్ర మనుగడ సాగిస్తుందన్నారు. బీజేపీ సర్కార్ వచ్చాకే ఎరువుల సబ్సిడీ తగ్గించి కోత విధిస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనే ఫసల్ బీమా అమలు కావడం లేదని, ఇందుకు ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని నిలదీశారు.
రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడే పంటల బీమా పథకం సొంతంగా రాష్ట్ర పరిధిలోకి తేవాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. పంటల మార్పిడి, సీజన్ల పంటల సాగు ముందు ప్రతి రైతు తమ పొలాలకు భూసార పరీక్షలు చేయించుకొని, నిపుణుల ,శాస్త్రవేతల సూచనలకు పాటించాలన్నారు. త్వరలో ప్రతి జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 40 వరకు ఆయిల్ పామ్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అనంతరం గంగారెడ్డి మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు, పంటల సాగుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.