PM Modi | విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి.. మంచి మార్కులు సాధించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమను నమ్మి ఓటేసిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న విషయాన్ని మాత్రం మరిచిపోయారు. అందుకే 9 ఏండ్ల బీజేపీ పాలన.. 35 బేస్ మార్కులను కూడా దాటలేకపోయింది.
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హామీలు ఇచ్చి తప్పడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారును మించినవారు మరొకరు లేరు. అధికారంలోకి వస్తే, ‘ఇది చేస్తాం.. అది చేస్తాం’ అంటూ అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపించిన కమలదళం నేతలు.. గడిచిన 9 ఏండ్లల్లో దేశాన్ని అధోగతిపాలు చేశారు. ఇన్నేండ్ల బీజేపీ పాలనకు ప్రోగ్రెస్ కార్డును తయారు చేస్తే, పాస్ మార్కులు కూడా రావడంలేదు.
ఉద్యోగాలు
హామీ: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ కేంద్రం హామీ ఇచ్చింది. ఈ లెక్కన గడిచిన 9 ఏండ్లల్లో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.
ప్రస్తుత పరిస్థితి: గడిచిన 9 ఏండ్లలో తమ ప్రభుత్వం 1.25 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ ఇటీవల తెలిపారు. ఈ లెక్కన ఇచ్చిన హామీ ప్రకారం ఇంకా 16.75 కోట్ల ఉద్యోగాలు ఇవ్వడంలో కేంద్రం ఇంకా వెనుకబడే ఉన్నట్టు లెక్క.
మార్కులు: 7/100
భారీ ప్రాజెక్టులు
హామీ: రూ.150 కోట్ల కంటే ఎక్కువ విలువైన 1,500 భారీ ప్రాజెక్టులను 2022 నాటికి పూర్తిచేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
ప్రస్తుత పరిస్థితి: దాదాపు వెయ్యి ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదు. 379 ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతుండటంతో రూ.4.64 లక్షల కోట్ల అదనపు భారం ఖజానాపై పడింది.
మార్కులు: 33/100
తాగు నీరు
హామీ: ‘ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందిస్తాం. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తాం’ అంటూ 2019 ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ఊదరగొట్టారు.
ప్రస్తుత పరిస్థితి: 70 శాతం ఇండ్లకు ఇప్పటికీ నీటి సరఫరా లేదు.
మార్కులు: 30/100
విద్యుత్తు
హామీ: రెప్పపాటు సమయం కూడా కోతలు లేకుండా 24 గంటలపాటు విద్యుత్తు ఇస్తామని హామీనిచ్చారు.
ప్రస్తుత పరిస్థితి: లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం.. దేశంలోని దాదాపు 86 శాతం మంది విద్యుత్తు కోతలు ఎదుర్కొంటున్నారు.
మార్కులు: 14/100
పోషకాహారం
హామీ: పోషకాహారలోపం లేని భారత్ను నిర్మిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితి: దేశంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో 72 శాతం మంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. మోదీ స్వరాష్ట్రం గుజరాత్ ఈ విషయంలో ముందంజలో ఉన్నది.
మార్కులు: 28/100
రైతుల ఆదాయం
హామీ: 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఊదరగొట్టారు.
ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని బట్టి అంచనా వేస్తే రైతుల ఆదాయం 21 శాతం మాత్రమే పెరిగింది.
మార్కులు: 21/100
జీవిత బీమా
హామీ: దేశంలోని ప్రతి ఒక్కరినీ జీవిత బీమా పాలసీ పరిధిలోకి తీసుకొస్తామన్నారు.
ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం ప్రతి 100 మందిలో ముగ్గురికే జీవిత బీమా పాలసీ ఉన్నది.
మార్కులు: 3/100
వైఫై హాట్స్పాట్లు
హామీ: ‘పీఎం-వాణి’ పథకంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో కోటి వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేసి ఇంటర్నెట్ సౌకర్యాన్ని విస్తరిస్తామని ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం ఈ ప్రాజెక్టు 2 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు.
మార్కులు: 2/100
సాగునీరు
హామీ: దేశంలోని ప్రతి ఎకరాకు నిరంతరాయంగా సాగునీరు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుత పరిస్థితి: 70% సాగుభూమికి వర్షమే ఆధారంగా ఉన్నది.
మార్కులు: 30/100
ఇంటర్నెట్
హామీ: దేశంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితి: కేవలం 25 శాతం మేర మాత్రమే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి.
మార్కులు: 25/100
రైలు ప్రమాదాలు
హామీ: రైలు ప్రమాదాల్లో ఒక్క మరణం కూడా సంభవించకుండా చర్యలు తీసుకుంటామని వాగ్ధానం చేశారు.
ప్రస్తుత పరిస్థితి: ఒడిశాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో 292 మంది మృత్యువాత పడ్డారు. నిరుడు మొత్తం 13 వేల రైలు ప్రమాదాలు జరగగా, 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
మార్కులు: 0/100
పరిశుభ్రత
హామీ: మలమూత్రాలను మనుషులు చేతులతో తొలగించే విధానాన్ని పూర్తిగా ఎత్తేస్తామంటూ ఊదరగొట్టారు.
ప్రస్తుత పరిస్థితి: ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 42,303 మంది ఇంకా చేతులతోనే అశుద్ధాన్ని ఎత్తిపోస్తున్నారు. వీరి సంఖ్య లక్ష దాటొచ్చని నివేదికల సారాంశం.
మార్కులు: 0/100
స్కూల్ డ్రాపౌట్లు
హామీ: బడి బయట ఉండే చిన్నారుల సంఖ్యను (స్కూల్ డ్రాపౌట్లు) జీరోకు తీసుకొస్తామంటూ ప్రగల్భాలు పలికారు.
ప్రస్తుత పరిస్థితి: నివేదికల ప్రకారం.. దేశంలో ఇప్పటికీ 15 కోట్ల మంది పిల్లలు బడికి దూరంగానే ఉన్నారు.
మార్కులు: 0/100
పర్యాటకం
హామీ: వెనుకబడిన వందకు పైగా ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసి, గ్లోబల్ ఐకాన్లుగా మారుస్తామని ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితి: ఇప్పటివరకూ ఒక్క ప్రాంతాన్ని కూడా టూరిస్ట్ స్పాట్గా మార్చలేదు.
మార్కులు: 0/100
నమామీ గంగే
హామీ: ‘నమామీ గంగే’ పథకం కింద గంగానదిని స్వచ్ఛగంగగా మారుస్తామన్నారు.
ప్రస్తుత పరిస్థితి: ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.30 వేల కోట్ల నిధులు ఖర్చుచేశారు. అయినప్పటికీ, 70 శాతం గంగానదీ తీర ప్రాంతం ఇంకా మురికిగానే ఉన్నది.
మార్కులు: 30/100
మిషన్ ‘ఇంద్రధనుస్సు’
హామీ: ‘ఇంద్రధనుస్సు’ స్కీమ్లో భాగంగా నవజాత శిశువులకు విధిగా ఏడు వ్యాక్సిన్లు ఇస్తామని ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితి: ఒకటి లేదా రెండు వ్యాక్సిన్లకు మించి ఇవ్వడంలేదని గణాంకాలు చెప్తున్నాయి.
మార్కులు: 28/100
సాయిల్ హెల్త్ కార్డులు
హామీ: పంట దిగుబడి పెంచడానికి, రైతులకు అండగా ఉండటానికి నేల రకాలను అన్నదాతలకు తెలిసే విధంగా ‘సాయిల్ హెల్త్ కార్డు’లు అందరికీ అందిస్తామన్నారు.
ప్రస్తుత పరిస్థితి: 80 శాతం మంది రైతులకు ఇప్పటికీ ఎటువంటి కార్డులు ఇవ్వలేదు.
మార్కులు: 20/100
ఉడాన్ స్కీమ్
హామీ: దేశంలో కనెక్టివిటీకి దూరంగా ఉన్న దాదాపు 500 ప్రాంతాలకు ‘ఉడాన్’ ద్వారా వైమానిక సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితి: 15 శాతం లక్ష్యాన్నికూడా పూర్తిచేయలేదు.
మార్కులు: 15/100
జల సంరక్షణ
హామీ: వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో భాగంగా కొత్తగా 5 లక్షల చెరువులను నిర్మిస్తామని హడావుడి చేశారు.
ప్రస్తుత పరిస్థితి: ఇప్పటివరకూ ఒక్క చెరువును కూడా నిర్మించినట్టు రికార్డుల్లో లేదు.
మార్కులు: 0/100
ఎరువుల కిట్
హామీ: దేశంలోని ప్రతి రైతు ఇంటికే ఎరువుల కిట్ను పంపిస్తామని ఊదరగొట్టారు.
ప్రస్తుత పరిస్థితి: 10 శాతం పనులు కూడా పూర్తికాలేదు.
మార్కులు: 10/100
– స్పెషల్ టాస్క్ బ్యూరో
– కడవేర్గు రాజశేఖర్