నోటీసులందుకొన్న రెండో ప్రధాని
రెండుసార్లు అందుకున్న తొలి ప్రధాని
హక్కుల ఉల్లంఘన.. శిక్షార్హమైన నేరం
హైదరాబాద్, ఫిబ్రవరి 10 : సభా సంప్రదాయాలను గౌరవించాల్సిన ప్రధానమంత్రే, సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడటంలో నరేంద్రమోదీ ముందు వరుసలో ఉన్నారు. భారతదేశంలో ఇంతమంది ప్రధానులుగా పనిచేసినప్పటికీ.. ఇద్దరిపైనే సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. గతంలో మన్మోహన్సింగ్పై బీజేపీ నోటీసు ఇచ్చింది. కాగా.. ఏకంగా రెండుసార్లు నోటీసులందుకొన్న ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. గతంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నోటీసులు ఇచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై సభలో ప్రధానిమోదీ, అప్పటి రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ సభను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్పార్టీ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. తాజాగా టీఆర్ఎస్ సభ్యులు.. పార్లమెంట్సాక్షిగా రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఉభయసభల్లో నోటీసులు ఇచ్చారు.
ఇందిరపై వేటు
1975లో ఎమర్జెన్సీ సమయంలో మితిమీరిన అక్రమాలు జరగడంతో.. అందుకు కారణమైన ఇం ధిరాగాంధీ (నోటీసు ఇచ్చే సమయంలో ఇందిరాగాంధీ ఎంపీ మాత్రమే)పై జస్టిస్ షా కమిషన్ విచారణ ఆధారంగా జనతాపార్టీ సర్కారులో అప్పటి హోం మంత్రి చరణ్సింగ్ ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. లోక్సభకు చిక్మగళూరు నుంచి ఎన్నికైన ఇందిరాను సభ నుంచి బహిష్కరించిన ఉదంతం హక్కుల ఉల్లంఘనల్లో అత్యంత కీలకమైంది. పార్లమెంట్ చరిత్రలో తొలిసారి యూపీఏ హయాంలో ప్రధాని మన్మోహన్సింగ్కు ప్రతిపక్ష బీజేపీ హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది.
హక్కుల ఉల్లంఘన అంటే..
లోక్సభ లేదా రాజ్యసభ సభ్యులు వ్యక్తిగతంగా, సమిష్టిగా కొన్ని హక్కులు, మినహాయింపులను అనుభవిస్తారు. ఎవరైనా వీటిని విస్మరించినప్పుడు అది ‘ప్రత్యేక హక్కుల ఉల్లంఘన’ కింద నేరం.