రూ.3.5 కోట్లతో గోదావరిఖనిలో మోడ్రన్ పోలీస్స్టేషన్
వందమంది కూర్చునేలా విజిటింగ్ హాల్
రూ.1.5 కోట్లతో అతిథిగృహం నిర్మాణం
త్వరలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా
కరీంనగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వంద మంది కూర్చునేలా నిర్మించిన విజిటింగ్ హాల్, విశాలమైన డైనింగ్ హాల్, సిబ్బందికి వేర్వేరుగా ప్రత్యేక గదులు, అటాచ్డ్ టాయిలెట్లు, యోగా హాల్, గెస్ట్ రూం, లైబ్రరీ, సువిశాల పార్కింగ్.. ఇవీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మోడ్రన్ పోలీస్స్టేషన్ విశేషాలు. తెలంగాణ ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దశాబ్దాలుగా అరకొర వసతులతో కొట్టుమిట్టాడుతున్న పోలీస్స్టేషన్లకు అధునాతన భవనాలు నిర్మించేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖనిలో రూ.3.50 కోట్లతో మోడ్రన్ పోలీస్స్టేషన్ నిర్మించారు. రూ.1.50 కోట్లతో పోలీస్ అతిథి గృహం కమ్ వెల్ఫేర్ సెంటర్ నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ రెండు భవనాలు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
అత్యాధునిక వసతులతో స్టేషన్..
సింగరేణి, ఎన్టీపీసీ, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, తెలంగాణ జెన్కో, కేశోరాం సిమెంట్స్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలతో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, గోదావరిఖని ప్రాంతం ప్రసిద్ధి చెం దింది. ఇక్కడున్న పోలీస్ స్టేషన్ సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిన స్థలంలో పురాతన భవనంలో అరకొర వసతులతో కొనసాగుతున్నది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ నేరాల సంఖ్యతోపాటు ఫిర్యాదులూ ఎక్కువే. రోజుకు 200 నుంచి 300 మంది పిటిషనర్లు, సందర్శకులు స్టేషన్కు వస్తుంటారు. రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్లలో ఇదొకటి. ఈ నేపథ్యంలో గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ను ఆధునీకరించాలని పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ నిర్ణయించారు. వెంటనే ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అత్యాధునిక సౌకర్యాలతో దేశంలోనే నంబర్వన్ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు సింగరేణి సౌజన్యంతో 14,290 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల భవనాన్ని రూ.3.50 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇందులో ఒకేసారి వందమంది సందర్శకులు కూర్చునేలా విజిటింగ్ హాల్, పురుషులు, మహిళలకు వాష్ రూములు, సరిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లకు వేర్వేరుగా గదులు, అటాచ్డ్ టాయిలెట్లు, పురుష, మహిళా కానిస్టేబుళ్లకు వేర్వేరుగా హాళ్లు, డైనింగ్ హాళ్లు, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా కౌన్సెలింగ్ హాళ్లు ఉన్నాయి. ఆఫీసర్లకు డైనింగ్ హాళ్లు, వాష్ రూంలతోపాటు గెస్ట్ రూంలు నిర్మించారు. యోగాకు ప్రత్యేకించి ఒక హాలుతోపాటు.. గ్రంథాలయం, సందర్శకులకు విశాలమైన పారింగ్ స్థలం కల్పించారు.
రూ.1.50 కోట్లతో అతిథి గృహం
పారిశ్రామిక ప్రాంతం రామగుండం పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక్క అతిథి గృహం లేదు. రామగుండానికి వస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులకు తగిన వసతి లేక ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో రామగుండంలో సకల హంగులతో అతిథి గృహం నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఎన్టీపీసీ సౌజన్యంతో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ 1.50 ఎకరాల స్థలంలో 9,827 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో నిర్మాణం పూర్తయ్యింది.
త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
రామగుండం వాసిగా నాకు ఈ ప్రాంత ప్రజల అవసరాలు తెలుసు. అందుకే మోడల్ స్టేషన్తోపాటు పోలీస్ గెస్ట్హౌస్ నిర్మించాలని భావించాను. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. ముఖ్యమంత్రి చొరవతో వీటి నిర్మాణాలకు స్థలంతోపాటు డబ్బులను సింగరేణి, ఎన్టీపీసీ సమకూర్చాయి. పోలీసు హౌసింగ్ బోర్డు తరఫున యుద్ధప్రాతిపదికన నిర్మాణాలు పూర్తిచేశాం. ఈ రెండు భవనాలను మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా త్వరలోనే ప్రారంభింపజేసుకొంటాం. ప్రత్యేక చొరవ చూపి మోడ్రన్ పోలీస్స్టేషన్, గెస్ట్హౌస్ నిర్మించేందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
–కోలేటి దామోదర్, చైర్మన్ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్