హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గురువారం పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళఖాతంలోని పలు ప్రాంతాలకు, మొత్తం అండమాన్ నికోబార్ దీవులకు, మొత్తం అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవానలు మరింతగా విస్తరించాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర- దక్షిణ ద్రోణి మధ్య ప్రదేశ్ నుంచి విదర్భ, మరట్వాడ, ఇంటీరియర్ కర్నాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9కిలో మీటర్ల ఎత్తులో ఉందని పేర్కొన్నది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 20 జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 8.11 సెంటిమీటర్లు, వికారాబాద్ జిల్లా దోమలో 5.08, నారాయణపేట జిల్లా కృష్ణలో 4.75 సెంటీ మీటర్ల వర్షం కురిసినట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది.
వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. బుధవారం పగటి ఉష్ణోగ్రతలు 19 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదు అయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 41.9 డిగ్రీల సెంటిగ్రేడ్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల 41.5, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ 41.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.