హైదరాబాద్: పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు విస్తరించిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులు ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD-Hyderabad) తెలిపింది. బుధవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. రైతులు వరి కోతలను నిలిపేయాలని, కోసిన పంటల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మంగళవారం సాయంత్రం ప్రారంభమైన వాన బుధవారం ఉదయం కూడా కురుస్తూనే ఉన్నది. అత్యధికంగా సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో 8.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో 7.9 సెంటీమీటర్లు, హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 7.7, యాదాద్రి భువనగిరి జిల్లా నందనం, మేడ్చల్ జిల్లా కీసరలో 7.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వికారాబాద్, జనగామ, నల్లగొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ వర్షం పడింది. అకాల వర్షాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించింది.
గ్రేటర్ హైదరాబాద్లో..
హైదరాబాద్లో మంగళవారం రాత్రి వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, పటాన్చెరు, అమీన్పూర్, అల్వాల్, నేరెడ్మెట్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, చందానగర్, మియాపూర్, బాలానగర్, సూరారం, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, అమీర్పేట, పంజాగుట్ట, కూకట్పల్లి, బాచుపల్లి, ఈసీఐఎల్, జూబ్ల్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.