హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ‘జయ జయహే తెలంగాణ…’ పాటకు సంగీతాన్ని అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ర్టానికి చెందిన సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదం అవుతుందని తెలంగాణ సినీ మ్యూజీషియన్స్ అసోసియేషన్(టీసీఎంఏ) ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ మేరకు శనివారం టీసీఎంఏ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరిట ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ..’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించి విడుదల చేయబోతున్నందుకు తెలంగాణ ప్రజలు, కళాకారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఇది టీసీఎంఏ గర్విస్తున్న గొప్ప సందర్భమని చెప్పారు. అయితే ఇంతటి గొప్ప గేయాన్ని పాడించే బాధ్యతను, సంగీతాన్ని అందించే బాధ్యతను తెలంగాణ కళాకారులకు కాకుండా పక్క రాష్ట్రం వాళ్లకు అప్పగించడం సరైన నిర్ణయం కాదని లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ నిర్ణయం మన తెలంగాణ కళాకారులను అవమానించడమే అవుతుందని సీఎంను ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారని, ఈ గొప్ప అవకాశాన్ని వారికి ఇస్తారని ఆశిస్తున్నామని తెలిపారు.