హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా ఇచ్చేవరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ చట్టంలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు లేకపోవడం ఆందోళకరమని అన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టం వల్ల భారత్లో మహిళలకు భవిష్యత్తులో మంచిరోజులు వస్తాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. చట్టసభల్లోకి మరింత మంది మహిళలు ప్రవేశించడానికి ఈ చట్టం మార్గం చూపుతుందని తెలిపారు. ప్రస్తుతం భారత పార్లమెంటులో 78 మంది మహిళలు ఎంపీలుగా ఉన్నారని, మహిళా రిజర్వేషన్లతో ఆ సంఖ్య 181కు చేరుతుందని వివరించారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా ‘మహిళా రిజర్వేషన్లు -ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కీలకోపన్యాసం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా బిల్లు కోసం తీర్మానం చేయించి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తారని, ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ కూడా లేఖ రాశారని వివరించారు. స్థానిక పరిపాలనలో మహిళల భాగస్వామ్యం దాదాపు 57 శాతానికి పెరిగిందని చెప్పారు. తెలంగాణలో స్థానిక సంస్థల పదవుల్లో దాదాపు 55-57 శాతం మంది మహిళలే ఉన్నట్టు తెలిపారు. వారిలో 92 శాతం బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే కావడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు.
వివక్షను జయించే మార్గాలు అన్వేషించాలి
పురుషాధిపత్యం, మహిళల అణచివేత, మహిళల శ్రమదోపిడీ వంటి సవాళ్లపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉన్నదని కవిత అన్నారు. దేశంలో స్థానిక సంస్థల్లో 14 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నా అందులో అత్యధికులు స్వతంత్రంగా వ్యహరించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైద్య పరిశోధనల కోసం కోట్ల డబ్బు ఖర్చు చేసేది పురుషుల ఆరోగ్యంపై పరిశోధన చేయడానికేనా? అని ప్రశ్నించారు. మహిళల ఆరోగ్యం ఎందుకు ముఖ్యం కాదని ప్రశ్నించారు. స్టార్టప్ కంపెనీల ఏర్పాటులోనూ మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కడంలేదని, 10 స్టార్టప్ లు ఏర్పడితే మహిళలకు ఒకటో రెండో మాత్రమే ఉంటున్నాయని అన్నారు. మహిళల నేతృత్వంలోని స్టార్టప్లకు ఆర్థిక సాయం అందడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితికి రాజకీయ నేతలంతా కారకులేనని విమర్శించారు. మహిళల భాగస్వామ్యం లేకపోతే ప్రగతి అసాధ్యమని పేర్కొన్నారు.
కవితపై ప్రశంసల వెల్లువ
దేశ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్సీ కవితపై లండన్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. చట్టసభల్లో అత్యల్పంగా ఉన్న మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచడానికి కవిత కృషి చేశారని వక్తలు కొనియాడారు. మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దేశ రాజధానిలో ఒక రోజు దీక్ష చేయడమే కాకుండా ప్రజల్లో ఈ అంశంపై చర్చ రేకెత్తడానికి రౌండ్టేబుల్ సమావేశాన్ని సైతం నిర్వహించారని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్లపై కవిత చేసిన కృషిపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ ప్రదర్శించిన వీడియో సభికులను ఆకట్టుకుంది. 2014లో మొదటిసారి కొత్తగా ఏర్పడిన తెలంగాణ నుంచి పార్లమెంటుకు ఎన్నిక అయిన కవిత, సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో మహిళా సాధికారత కోసం పనిచేశారని ఆ సంస్థ కొనియాడింది.