ఖమ్మం, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలిచిన తెలంగాణ రాష్ర్టాన్ని అధోగతి పాలుజేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని సబ్బండ వర్గాలు కోరుకుంటున్నాయని తెలిపారు. ఈ దఫా పదికి పది అసెంబ్లీ స్థానాలను గెలువాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పాల్గొన్నారు.