ఖమ్మం, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు అంశంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అధ్యక్షతన ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన పాలేరు నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యుల సమావేశంలో రవీందర్రావు మాట్లాడారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక చర్యల వల్ల అన్ని వర్గాల ప్రజలు విసుగుచెందారని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్లలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ఆ విజయాలను క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ప్రచారం చేయాలని సూచించారు. సభ్యత్వ నమోదును ప్రతి గ్రామంలో డిజిటల్ పద్ధతిలో చేయాలని తెలిపారు.
ప్రతి బూత్కూ ఇద్దరు కార్యకర్తలను నియమించి సభ్యత్వ నమోదును నిర్వహించాలని సూచించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్, కేసీఆర్కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.