హైదరాబాద్, సెప్టెంబర్10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ రజకుల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం రజకులకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణం, రూ.లక్ష రుణసాయమే నిదర్శనమని వివరించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్లో ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సభ నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రజక సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ ఎండీ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వపరంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చాకలి ఐలమ్మ వర్ధంతి సభను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. దేశంలో ఎకడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రజక, నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వారి అభివృద్ధికి మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తున్నదని తెలిపారు. సభలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, రజక సంఘం రాష్ట్ర నాయకులు ఆంజనేయులు, రాధ, సమాఖ్య ఉద్యోగులు అబ్దుల్ బాసిత్, ప్రభాకర్, కరుణాకర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.