హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ – వరంగల్- ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. మూడు జిల్లాల్లో కలిపి 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక బ్యాలట్ పేపర్ ద్వారా నిర్వహిస్తారు. బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. దీంతో పెద్ద సైజు బ్యాలెట్ పేపర్ వినియోగించారు. వీటికోసం జంబో బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో
పాల్గొంటున్నారు. పోలింగ్ సిబ్బందికి ఆదివారం ఎన్నికల సామగ్రి అందించి ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించారు. ఒక పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పట్టణాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 283 పోలింగ్ కేంద్రాల్లో 800 మంది కంటే ఎక్కువగా ఓటర్లు ఉన్నారు. మొదట 600 పోలింగ్ కేంద్రాలే ఏర్పాటు చేయాలనుకున్నా.. భూపాలపల్లి జిల్లాలో మూడు, ములుగు జిల్లాల్లో రెండు పోలింగ్ కేంద్రాలను మారుమూల ప్రాంతాల ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఈ ఎన్నికలో నోటా ఆప్షన్ ఉండదు. వచ్చే నెల 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం స్పెషల్ క్యాజువల్ లీవ్గా ఎన్నికల కమిషన్ మంజూరు చేసింది. ప్రైవేటు సంస్థలు, కార్యాలయాల్లో పనిచేసే వారు ఓటు హక్కు వినియోగించుకునేలా పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని ఆయా సంస్థలకు సూచించింది.
ఓటర్లకు ముఖ్య సూచనలు
మొత్తం ఓటర్లు 4,63,839