హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కొన్ని సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు కుట్రపూరితంగా పనిగట్టుకొని అసత్య ప్రచారం చేస్తున్నాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. లేని రైతు ఆత్మహత్యలను ఉన్నట్టు చూపిస్తూ రైతుల ఉసురు పోసుకొంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతో తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జీరోకి పడిపోయాయని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేస్తున్న సంస్థలు, పత్రికలకు ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సోమవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజు, ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రైతులను ఆత్మహత్యలకు పురికొల్పేలా పనిగట్టుకొని కొన్ని సంస్థలు, పత్రికలు విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో వ్యవహరిస్తున్న శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని పార్లమెంట్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారని, అలాగే నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో, నీతి అయోగ్ వంటి చట్టబద్ధ సంస్థలు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు 400 శాతం తగ్గాయని ప్రకటించాయని గుర్తుచేశారు.
వాస్తవాలు ఇలా ఉంటే రైతు స్వరాజ్య వేదిక ఇచ్చిన కాకిలెక్కలను బూచిగా చూపి కొన్ని పత్రికలు పుంఖానుపుంఖాలుగా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని చెప్తున్న సంస్థలకు సాధికారత ఏమిటని ప్రశ్నించారు. చట్టబద్ధ సంస్థల కంటే రైతు స్వరాజ్య వేదికకు ఎక్కువ విశ్వసనీయత ఉంటుందా? అని నిలదీశారు. తాడు బొంగరంలేని పత్రికలు, సంస్థలు ఇచ్చే సమాచారం ఆధారంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోరుపారేసుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏకంగా 10 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని బండి సంజయ్ పేర్కొనటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతు ఆత్మహత్యల విషయంలోకానీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలపై కానీ తాము అన్ని ఆధారాలు చూపిస్తామని, వీటిపై దమ్ముంటే బండి సంజయ్ చర్చకు రావాలని సవాల్ చేశారు. పార్లమెంటు వేదికగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని చెప్తే, బండి సంజయ్ పెరిగాయని కూస్తున్న కారుకూతలకు అర్థమే లేదని కొట్టిపారేశారు.
సాగులో తెలంగాణ నంబర్ 1
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో దేశంలో తెలంగాణ నంబర్ 1 స్థానానికి చేరిందని నీతి ఆయోగ్ నివేదికే స్పష్టం చేసిందని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీటి సౌకర్యం కల్పించటంతో రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకొన్నారని నీతి ఆయోగ్ తన రికార్డుల్లో తేల్చి చెప్పిందని గుర్తుచేశారు. ఇండియా టుడే లాంటి జాతీయ పత్రికలు సైతం తెలంగాణ రైతు సంక్షేమం గురించి ఆధారాలు, నివేదికలతోసహా రిపోర్ట్ చేశాయని ఉదహరించారు. ‘రైతుబంధు పథకాన్ని ఎలా నిరోధించాలి? రైతులకు ఆ పథకం అందకుండా ఏంచేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నది. రైతుబంధు భూస్వాములకే వస్తున్నదని బీజేపీ చెప్పటంలో అర్థం లేదు.
రైతుబంధు పథకం లబ్ధిదారుల్లో సన్న, చిన్నకారు రైతులే 91.19 శాతం ఉన్నారు. కావాలంటే రైతులవారీగా, పట్టాలవారీగా సమాచారం ఇస్తాం చూసుకోండి. రైతుబంధును కాపీ కొట్టిన కేంద్రం పీఎం కిసాన్ యోజన పథకాన్ని 13 కోట్ల మందికి ఇస్తామని చెప్పి 3 కోట్లమందికే పరిమితం చేసింది’ అని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయటం బీజేపీకి ఇష్టంలేదని పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. యువత ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతూ బీజేపీ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండటంతో ఆ పార్టీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ప్రపంచంలోనే కంటివెలుగు అద్భుతమైన కార్యక్రమమని నేత్రవైద్య నిపుణులు కీర్తిస్తుంటే, బీజేపీ నేతలకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిబంధనల ప్రకారమే జరుగుతాయని పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టంచేశారు. సమావేశాలపై శాసనసమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకొంటారని చెప్పారు.
గవర్నర్ హుందాగా వ్యవహరించాలి: ఎంఎస్ ప్రభాకర్రావు
రాష్ట్ర గవర్నర్ హుందాగా వ్యవహరించాలని శాసనమండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు సూచించారు. రాజకీయ నాయకులు వేరు, రాజ్యాంగ పదవులను అలంకరించినవారు వేరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ విపక్ష నేతలా మాట్లాడకూడదని హితవు పలికారు. తాము గవర్నర్ హోదాను ఎప్పుటికీ గౌరవిస్తామని, ఎవరి గౌరవాలను వారు కాపాడుకోవాలని సూచించారు. రాజ్భవన్ను బీజేపీ తన రాజకీయ వేదికగా వాడుకొంటున్నదనే విమర్శలు వస్తున్నాయని, అందుకు ఇటీవల రాజ్భవన్ వద్ద వెలసిన పోస్టర్లే నిదర్శమని విమర్శించారు. ప్రధాని మోదీ బీసీ వర్గాలకు చెందిన వాడే అయినా, ఆ వర్గాలకు ఆయన చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ వీ గంగాధర్గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా బీసీలంతా డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికపై బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
చిచ్చుపెట్టే శక్తులకు ఆర్ఎస్ ప్రవీణ్ వత్తాసు: గువ్వల బాలరాజు
రాష్ట్రంలో మతచిచ్చుపెట్టే శక్తులకు బీఎస్సీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ వత్తాసు పలుకుతున్నారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఆరోపించారు. ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలను ఖండించారు. పోలీసు అధికారిగా ఉన్నప్పుడు నాటి ప్రభుత్వాల మెప్పు కోసం అనేక ఉద్యమాలను అణచివేసిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్దని గుర్తుచేశారు. మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో ఊచకోత కోసిన ఆర్ఎస్ ప్రవీణ్, ఇవ్వాళ యువతను ఉద్ధరిస్తానంటే ఎవరూ నమ్మరని అన్నారు. గురుకులాల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి, నాణ్యమైన ఆహారం అందించాలని ప్రభుత్వం చెప్తే, స్వేరోస్ అనే సమాంతర వ్యవవస్థను నడిపి తన అనుయాయులకు కాంట్రాక్టులు అప్పగించి దోచిపెట్టారని ఆరోపించారు.