హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు, కేసీఆర్ను ఇబ్బందిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ సరిగా జరగట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని, ఆయనకు తప్ప రైతులు ఎవరికీ ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ అవాస్తవాలు చెప్పారని విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లోక్సభలో లెక్కలతో సహా చెప్పారని గుర్తుచేశారు. మెడికల్ మేనేజ్మెంట్ సీట్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక్క మేనేజ్మెంట్ సీటు ఇవ్వలేదని చెప్పారు. రేవంత్ ఇలాగే వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
2014 నుంచి నేటివరకు ధాన్యం ఎలా సేకరించామో కూడా విపక్షాలకు తెలియదన్నారు. 2020-21లో ఎఫ్సీఐకి 141.1 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మినట్లు వెల్లడించారు. పీయూష్ గోయల్కు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని చెప్పామని, ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో పోరాటం చేశామని.. ఐనా కేంద్రం మనసు కరగడం లేదని విమర్శించారు. అందుకే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకొచ్చారని వెల్లడించారు. రూ.3 వేల కోట్లు నష్టం వచ్చినా భరించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. పారా బాయిల్డ్ రైస్ తీసుకోవాలని ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రభుత్వాలు కూడా కేంద్రాన్ని కోరాయన్నారు.