Palla Rajeshwar Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీది గాంధీ స్ఫూర్తి అయితే.. బీజేపీది గాడ్సే స్ఫూర్తి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్తో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్ఎస్ తరపున నివాళులర్పిస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ ఆశయాలను కేసీఆర్ ప్రభుత్వం కచ్చితంగా ఆచరిస్తున్నదని తెలిపారు. గాంధీ సినిమాను దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు రాష్ట్రంలో ప్రదర్శించి జాతిపిత గురించి మరింతగా తెలిసేలా చేశామన్నారు. నకిలీ గాంధీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిన్న పీఎం మోదీ అబద్దాలు అలవోకగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మోదీ లాంటి వ్యక్తి గల్లీ నాయకుడి స్థాయిలో వ్యవహరించారు. ప్రాజెక్టుల ద్వారా ఒక చుక్క నీరు పారలేదని మోదీ నిస్సిగ్గుగా మాట్లాడారు. ఇంత కన్నా అబద్దం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు.
మా ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాకపోతే ఇన్ని లక్షల టన్నుల ధాన్యం ఎలా పండిందని మోదీని పల్లా రాజేశ్వర్ రెడ్డి నిలదీశారు. మోదీకి బీజేపీ నేతలు తప్పుడు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. కనీసం రేపు నిజామాబాద్లోనైనా స్క్రిప్ట్ సరి చేసి మాట్లాడాలని సూచించారు. రైతు ఆత్మహత్యలపై కేంద్ర మంత్రి తోమర్ ఓ మాట చెబితే ప్రధాని మరో మాట చెప్పారు.. ఆ మాటలు విని అందరూ నవ్వుకుంటున్నారు. ప్రధాని రేపైనా నిజాలు మాట్లాడాలి. మా రైతుబంధుకు మీ కిసాన్ సమ్మాన్ నిధికి పోలిక ఎక్కడ అని ప్రశ్నించారు. రైతు బంధు ద్వారా ఇప్పటికే మేము రూ. 75 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశాము. కేంద్రం జమ చేసింది రూ.10 వేల కోట్లు మాత్రమే అని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు.
బీజేపీ అంటే బిజినెస్ జనతా పార్టీ అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. పసుపు బోర్డుపై తొమ్మిదేళ్లుగా మొత్తుకుంటే ఇపుడు ఎన్నికల ముందు మోదీ ప్రకటన చేశారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఎపుడో ఇవ్వాల్సింది.. ఇప్పుడు ప్రకటించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి కేసీఆర్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదని మోదీ అబద్దాలు మాట్లాడారు. మోదీ మాట్లాడింది తప్పు అని ఆధారాలతో సహా నిరూపిస్తాం అని స్పష్టం చేశారు.
గాడ్సే వారసులకు, నకిలీ గాంధీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు.. తెలంగాణ గాంధీ కేసీఆర్నే ప్రజలు నమ్ముతారని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. మళ్ళీ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్కే ఉంటుందన్నారు. కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మరు. కర్ణాటక మోడల్ ఫెయిల్ మోడల్. కాంగ్రెస్ పథకాలు ముందట పడవు. కాంగ్రెస్ ఏ పథకం అమలు చేసినా.. అది చివరి దాకా అమలు కాదని చరిత్ర చెబుతోంది. కర్ణాటక ప్రస్తుతం కరువుతో అల్లాడుతోంది అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
.