నమస్తే తెలంగాణ నెట్వర్క్: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు చెప్తే వెంటనే నిలదీయాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో ఎలా చేస్తారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించాలని సూచించా రు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లి-యారోనిపల్లి మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. దానిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అనంతరం జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న కొనగట్టుపల్లి పాలకవర్గాన్ని మంత్రి సన్మానించారు.
పచ్చి అబద్ధాలు ప్రచారం
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి వెళ్లారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని సోడాషపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్తో కలిసి పల్లా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ.. కేం ద్రం ఇచ్చిన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచుకుని ప్రజలకు ఇవ్వడం లేదని ప్రధాని అనడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో 80 కోట్ల రేషన్ కార్డులు ఉంటే.. 2023లో కూడా అవే 80 కోట్ల రేషన్కార్డులు ఉండటం సిగ్గు చేట న్నారు. రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల కార్డులకు బియ్యం ఇస్తున్నదని వెల్లడించారు.
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్
జోగుళాంబ గద్వాల జిల్లా లింగనవాయి లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ చైర్పర్సన్ సరిత, కన్జ్యూమర్ ఫోరం రాష్ట్ర చైర్మన్ గట్టు తిమ్మప్ప, బీఆర్ఎస్ యువజన నేత అజయ్తోపాటు పలువురు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. అలంపూర్లో 100 పడకల దవాఖాన పనులు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రజాసంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సంబురంగా సాగుతున్నాయి. నిర్మల్ జిల్లా ముథోల్లో నిర్వహించిన సమ్మేళనంలో ముథోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి, మంచిర్యాల జిల్లా జన్నారంలో ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, లక్షెట్టిపేటలో మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే దివాకర్రావు, కన్నెపల్లి మండలం టేకులపల్లిలో ఎమ్మెల్సీ దండె విఠ ల్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. కార్యకర్తలే తమ బలం.. బలగమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని నేతలు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామి
అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తున్నదని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి హాజరయ్యారు. మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఎనిమిదేండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకుపోతున్నది కేసీఆర్ ప్రభుత్వమని ఎమ్మెల్యే అరూరి తెలిపారు.
మోదీ చెప్పివన్నీ అబద్ధాలే
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చెప్పివన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మం జిల్లాలో 105 కిలోమీటర్ల మేర నిర్మించే ఖమ్మం-దేవరపల్లి రోడ్డుకు నిధు లు కేటాయించినట్టు చెప్పడంపై మండిపడ్డారు. ఖమ్మం మధిర మండలం మాటూరుపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
రోడ్డునపడ్డ నా కుటుంబాన్ని ఆదుకున్నరు
నా భర్త అనారోగ్యంతో చనిపోయిండు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి కార్యక్రమం చేసిన. చేతిల చిల్లి గవ్వ లేదు. ఎలా బతకాలి అనుకున్న టైంలో కేసీఆర్ సారు రూ.5 లక్షల రైతు బీమా చెక్కు ఇచ్చిండు. ఈ డబ్బులతో అప్పులు తీర్చిన. కొద్దిరోజుల తర్వాత నా కొడుకు జబ్బు పడితె దవాఖాన్ల చేర్పించిన. డబ్బులు అప్పు తెచ్చి ఇబ్బందులు పడుతుండగా ఎమ్మెల్యే రమేశ్ సారుకు మా ఊరు వాళ్లు చెప్పిన్రు. వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2 లక్షలు ఇప్పించిన్రు. నాకు పింఛను కూడా ఇప్పించి రోడ్డున పడ్డ నా కుటుంబాన్ని ఆదుకున్నరు. నేను బతికున్నంత కాలం కేసీఆర్సార్కు రుణపడి ఉంట.
– కాందారి కవిత, మడిపల్లి(హనుమకొండ)