హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అసాధ్యాలను సుసాధ్యం చేసే నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి కొనియాడారు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు మద్దతుగా శనివారం జలవిహార్లో నిర్వహించిన సభలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. యశ్వంత్సిన్హాకు మద్దతు ప్రకటించడం, కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమం, సాధించిన రాష్ర్టాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన నేపథ్యాన్ని పల్లా రాజేశ్వర్రెడ్డి వివరించారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన కేసీఆర్ 14 ఏండ్లు ఉద్యమాన్ని నడిపి రాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు.
8 ఏండ్లలోనే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు కేసీఆర్ అని కొనియాడారు. తన మేధాసంపత్తితో అత్యుత్తమ పాలన అందిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని బాగుచేసుకోవడం, రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తు, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, ఐటీలో మేటిగా నిలపడం వంటి అనేక రంగాల్లో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరాన్ని రికార్డుస్థాయిలో పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేల్లో 103 మంది, 24 మంది ఎంపీలలో 16 మంది టీఆర్ఎస్ వారేనని చెప్పారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అత్యధికులు టీఆర్ఎస్వారేనని పేర్కొన్నారు.