హైదరాబాద్ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం మోపుతున్నాయని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా, దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం భారీ పన్నులతో ప్రజలను దోచుకుంటోందని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్యులు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రవాణా ఛార్జీలు పెరగడంతో అన్ని రంగాలపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించాలని, ప్రజలపై భారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.