హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్లో పాల్గొనాల్సిందింగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.
జూలై 2 న ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత అదే రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 8 గంటలకు దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటాప్రైమ్ మీట్కు ఎమ్మెల్సీ కవిత అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం ఇదే సమావేశంలో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు.
ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాదిగా వలంటీర్లు వివిధ ఏర్పాట్ల కోసం 80 కమిటీలుగా ఏర్పడి ఇందుకోసం శ్రమిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు.