హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు సోదాలు జరిగాయని, ఈ ప్రక్రియ మొత్తానికి కవిత సంపూర్ణంగా సహకరించారని చెప్పారు. ఈ మేరకు అరెస్ట్ ఆర్డర్, పంచనామా నివేదికల్లో పేర్కొన్నారు. వీటి ప్రకారం.. ఈడీ అధికారులు కవితకు ఈ నెల 14 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 17 కింద నోటీసులు జారీచేశారు. ఆ మేరకు శుక్రవారం మధ్యా హ్నం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఆమె నివాసానికి వచ్చారు. అధికారులు తమను పరిచయం చేసుకొని, సెర్చ్ వారంట్ను చూపించారు. ఎందుకు సోదాలు చేయాలనుకుంటున్నారో వివరించారు. సోదాలు చేసేముందు.. కావాలనుకుంటే తమను చెక్ చేసుకోవచ్చని అధికారులు చెప్పగా.. కవిత సున్నితంగా తిరస్కరించారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ జోగెందర్ ఆధ్వర్యంలో ఇంట్లో సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమైన సోదాలు సాయంత్రం 6:45 గంటలకు ముగిశాయి. ఈ క్రమంలో కవిత స్టేట్మెంట్ను సైతం వారు రికార్డ్ చేసుకున్నారు.
ఈసం దర్భంగా ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం 5:20 గంటలకు కవితను అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఆర్డర్ను ఆమెకు అందించారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 3, సెక్షన్ 4 ప్రకారం అరెస్ట్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అరెస్ట్కు సంబంధించి కవిత భర్త డీఆర్ అనిల్కుమార్కు సమాచారం ఇచ్చినట్టు ‘ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్’లో వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు కవిత సోదరుడు (కేటీఆర్), లాయర్లు, ఇతర సభ్యులు 20 మంది అనుమతి లేకుండాలోపలికి వచ్చారని ఆరోపించారు. సోదాలు పూర్తి శాంతియు తంగా సాగాయని, అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని, కొవిడ్ ప్రొటోకాల్ కూడా పాటించామని పంచనామా నివేదికలో పేర్కొన్నారు. ఈ సోదాల్లో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా, అసిస్టెంట్ డైరెక్టర్లు జోగీందర్, సుమిత్ గోయల్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కార్తీక్ మెహ్రా, హిమాన్షు చౌదరి, మమత నారా, సెపాయ్, బ్రజేశ్ చౌరాసియా, వరలక్ష్మి తుమ్మోజె పాల్గొన్నారు.