MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో ఆదివాసీ గూడేలు ఆగమయ్యాయని ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అనేక సమస్యల సుడిగుండంలో ఆదివాసీలు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం హామీలు ఇవ్వడం, ప్రకటనలు చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా తక్షణమే సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఆదివాసీ హక్కులు, సమస్యలపై పోరాట ఫలితంగానే శుక్రవారం నాడు ఆదివాసీ సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారని కవిత తెలిపారు. ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని స్పష్టం చేశారు. అయితే, తూతూ మంత్రంగా హామీలు ఇచ్చి చేతులు దులుపుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ఇటీవల తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్తో కలిసి బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని ఆదివాసీ గూడేలను సందర్శించానని.. ఆ సందర్భంగా ఎదుర్కొంటున్న అనేక కష్టాలను స్వయంగా చూశానని తెలిపారు.
కేసీఆర్ హయాంలో ఎంతగానో అభివృద్ధి చెందిన ఆదివాసీ గూడేలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి దూరమయ్యాయని కవిత అన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్వీర్యమైందని, కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆదివాసీలకు చేరువ చేసేలా కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల విద్యా , వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు. ప్రధానంగా అనేక సీజనల్ వ్యాధులతో ఆదివాసీలు సతమతమవుతున్నారని, కానీ వారికి సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు.
సీజనల్ వ్యాధుల కారణంగా అనేకమంది మరణించినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమని కవిత మండిపడ్డారు. ఆదివాసీ పిల్లలకు విద్యను అందించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాలు కుదేలయ్యాయని, దాంతో గురుకులాల్లో చదువుకోవాలంటే విద్యార్థులు భయపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా గురుకులల్లో విషాహారం తిని విద్యార్థులు మృతి చెందుతున్న కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఐటీడీఏ వ్యవస్థను పటిష్టం చేసి ఆదివాసీ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణమే ఆదివాసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల కోసం, వారి సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.