హైదరాబాద్: నిజాం నిరంకుశాన్ని ఎదురించిన ధీశాలి మల్లు స్వరాజ్యం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణలో గొప్ప యోధురాలి శకం ముగిసిపోయిందన్నారు. తెలంగాణ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించారు. స్వరాజ్యం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. తమలాంటి ఉద్యమకారులకు స్వరాజ్యం ఆదర్శంగా నిలిచారని చెప్పారు. తెలంగాణలో తుపాకీ పట్టిన మొదటి మహిళగా కీర్తి గడించారని తెలిపారు.
మల్లు స్వరాజ్యంను పట్టిస్తే రూ.10 వేలు బహుమతిగా ఇస్తామని అప్పట్లోనే ప్రకటించడమంటే ఆమె ఎంత గొప్పగా పోరాటం చేశారో అర్థమవుతున్నదని చెప్పారు. రెండోదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక సందర్భాల్లో ఆమె నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని వెల్లడించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం (93).. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం ఎంబీ భవన్లో ఉంచారు. అటునుంచి నల్లగొండకు తరలించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు పార్టీ కార్యాలయంలో నివాళి అర్పిస్తారు. అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం 3.30 గంటలకు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆమె పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు.