నిజామాబాద్: బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచే దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు, ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా పేదల మేలు కోసమేనని చెప్పారు. నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్సీ కవిత పంపిణీ చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్షా 116 సాయం అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.
గతంలో కరెంటు కోసం ఎన్నో బాధలు పడ్డామని, ఇవాళ తెలంగాణలో కరెంటు పోతే ఒక వార్త అని చెప్పారు. నిజామాబాద్ను అద్భుతనగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. నగరంలో పాత భవనాల కూల్చివేసి ప్రజా ప్రయోజన కట్టడాలు నిర్మిస్తామన్నారు. పాత బస్టాండ్ను తొలగించి రైల్వేస్టేషన్ దగ్గర నూతన నిర్మిస్తామన్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో కళాభారతిని, మైనార్టీల కోసం హజ్హౌస్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరం నలుమూలలా వెజ్, నాన్వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బీజేపీ నాయకులు ప్రజలను అనవసరంగా ఆగమాగం చేయొద్దని హితవు పలికారు.