నిజామాబాద్ : బీసీ కులగణన( BC census) ఎందుకు చేపట్టడం లేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )డిమాండ్ చేశారు. కుల వృత్తులకు చేయూతనివ్వకుండా కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం బీసీల జీవితాలతో ఆడుకుంటుందని ధ్వజమెత్తారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ఎందుకు చేయడం లేదని, ఓబీసీ రిజర్వేషన్లను ఎందుకు సక్రమంగా అమలు చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
దేశంలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్న కూడా ప్రశ్నించకుండా కాంగ్రెస్ పార్టీ పనికిరాని ప్రతిపక్ష పార్టీగా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.సోమవారం నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీనియర్ నాయకులు పొన్నాల లక్షయ్య, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, ఏ జీవన్ రెడ్డితో కలిసి కవిత విలేకరులతో మాట్లాడారు.
ఎన్నికలు ఉన్నాయి కాబట్టే బీసీలపై ఇతర పార్టీలకు ప్రేమ వచ్చిందని, ఎన్నికలు లేనప్పుడు బీసీలపై ప్రేమ చూపించింది ఎవరనేది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయక త్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసినంత మంచి పనులు ఏ పార్టీ చేయలేదని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న ఒక బీసీ వ్యక్తిని ఎందుకు తొలగించారన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చే ముందు సమాధానం చెప్పాలని అన్నారు.
బీసీ అధ్యక్షుడిని తొలగించి కొత్తగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నారు. ఉన్న పదవిని ఊడగొట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని తెలిసి మరీ లేని పదవిని ఇస్తామని చెప్పడమంటే బీసీలను రాజకీయంగా మభ్యపెట్టడమే. గత ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఈసారి అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉంది. బీసీ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి చేస్తారు? బీసీ సీఎం నినాదం కేవలం ఒక రాజకీయ నినాదం, శుష్క నినాదం, శూన్య నినాదం.
అది పనికొచ్చే నినాదం కాదు అని స్పష్టం చేశారు.జనగణన చేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని విమర్శించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయని పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. ఇటువంటి పార్టీ వచ్చి బీసీ డిక్లరేషన్ చేస్తే కాంగ్రెస్ చేసిన పాపాలు తొలగిపోవని, తెలంగాణ బీసీలు చైతన్యం కలిగిన వారు కాబట్టి కచ్చితంగా సీఎం కేసీఆర్ కే అండగా నిలబడతారని తేల్చి చెప్పారు.
కులగణన అంటేనే ఒక అంటరాని అంశంగా బీజేపీ భావిస్తున్నదని ఘాటుగా విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి రాష్ట్ర ప్రజల స్థితిగతులు తెలుసుకొని అన్ని వర్గాలకు అవసరమైన పనులను చేస్తున్నారని చెప్పారు.
బీసీ కులగణన ఎందుకు చేపట్టలేకపోతున్నదో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. జాతీయ బీసీ కమిషన్ ను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ దేశానికి మార్గనిర్దేశం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ తరఫున షబ్బీర్ అలీ పోటీ చేయడంపై స్పందిస్తూ… కామారెడ్డి లో చెల్లని రూపాయి నిజామాబాద్ ఎలా చెల్లుతుందన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. కామారెడ్డి నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తిని నిజామాబాద్ ఆదరిద్దామా అన్నదానిపై ప్రజలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్బన్ లో మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాను భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.