నిజామాబాద్ : చేనేత పై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు విధించలేదని, కానీ చేనేత పై పన్ను విధించిన ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీదేనిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ పార్టీ ఆలోచన విధానం ఏంటో నేతన్నలు ఆలోచించాలని కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో స్థానిక ఎమ్మెల్యే గణేష్తో కలిసికవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పద్మశాలీలతో ఆత్మీయ బంధాన్ని పెంపొందించుకునే క్రమంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడతూ వచ్చామని తెలిపారు.
52 తర్ప సంఘాలకు ఇప్పటికే ఇచ్చిన నిధులు కాకుండా మరిన్ని నిధులు ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే బిగాల గణేష్ విజ్ఞప్తి చేశారని, దాంతో 52 తర్ప సంఘాల భవనాల నిర్మాణాలకు తన ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ. కోటి ఇస్తున్నానని ప్రకటించారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి పథకాలు అందేలా కుల సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంఘాల పనితీరుపై కూడా పునరాలోచన చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ రాకముందు పద్మశాలలీల కులవృత్తి ప్రమాదంతో ఉండేదని, ఆ సామాజికవర్గానికి చెందిన వారికి ఎక్కువ భూములు కూడా లేవని చెప్పారు. దాంతో బాగా చదువుకొని చాలా మంది డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా ఆయా వృత్తుల్లో స్థిరపడ్డారని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది పద్మశాలీలు పేదరికంలో ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పద్మశాలీలు వ్యాపారంలో కూడా ఉన్నారని, వ్యాపారానికి శాంతి భద్రతలు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసునని అన్నారు. శాంతి భద్రతలను పుష్కలంగా ఇస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని వస్పష్టం చేశారు.
బట్టల వ్యాపారస్తులకు అనేక ప్రోత్సాహకాలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుందని, 24 గంటల నిరంతర విద్యుత్తు ఇస్తుండడం వల్ల బట్టల దుకాణాల్లో డీజిల్ కంపు లేదని వివరించారు. గత ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను కుదేలు చేశాయని విమర్శించారు. బీడీ కార్మికులకే కాకుండా టేకేదారులకు కూడా పెన్షన్ అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని తేల్చి చెప్పారు. మూడో సారి గణేష్కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో గణేష్ కు అండగా నిలబడి ఆశీర్వదించి మరోసాని శాసన సభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.