ఆర్మూర్ : తెలంగాణ ఏర్పడి తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండాయని, మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తెలిపారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ చెప్పింది చెప్పినట్లు చేసి చూపించారని, కాబట్టి ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా చేసి చూపిస్తారని స్పష్టం చేశారు.
ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇతర పార్టీలు వచ్చి మాటలు చెబుతాయని, ఆ మాటలను నమ్మి తప్పు వైపు వెళ్తే ఇప్పటి వరకు చేసుకున్న కుప్ప మొత్తం చిత్తిపోతుందని తెలిపారు. పట్టు విడవకుండా పోరాడి సీఎం కేసీఆర్ తెలంగాణను తెచ్చారని, తెచ్చిన తెలంగాణను పచ్చబడేలా చేస్తున్నారని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాకముందు, కేసీఆర్ సీఎం కాకముందు మన పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని కోరారు. గంగపుత్రులు చాలా పేదరికంతో ఉండేవారని, కాబట్టి గంగపుత్రుల జీవితాల్లో మార్పులు తేవాలని తెలంగాణ ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ ఆలోచించారని చెప్పారు. రాష్ట్రంలో పెన్షన్ల టెన్షన్ లేదని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప్పు, పప్పు, మంచినూనె, ఉల్లిగడ్డ వంటి అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని విమర్శించారు.