MLC Kavitha | న్యూఢిల్లీ : తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి 9:12 గంటలకు విడుదలయ్యారు. కవిత జైలు నుంచి బయటకు రాగానే అక్కడే ఉన్న తన కొడుకును ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత భర్త అనిల్, అన్నయ్య కేటీఆర్ను గుండెలకు హత్తుకుని ఆనందభాష్పాలు రాల్చారు. ఈ సమయంలో హరీశ్రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు 165 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు.
లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు మంగళవారం కవితకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమె బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించారు. బుధవారం ట్రయల్ కోర్టులో విచారణకు హాజరైన అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు రానున్నారు. మరోవైపు రేపు ఉదయం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. కాగా కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని.. ఛార్జ్ షీట్ కూడా దాఖలైందని ఈ దశలో కవితను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయడింది.
సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. సెక్షన్ 45 అనేది దుర్బల మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు ఢిల్లీ హైకోర్టు జడ్జి వ్యవహరించారని వ్యాఖ్యానించింది. సెక్షన్ 45పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది. ఒక మహిళ విద్యాధికురాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ నిరాకరించడం సరికాదని పేర్కొంది.
165 రోజుల తరువాత తీహార్ జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత pic.twitter.com/TrhQfr1RI5
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2024