MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్కు ఆమె లేఖ రాశారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఆ లేఖలో ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇప్పటివరకు తాను ఉపయోగించిన మొబైల్ ఫోన్లను ఈడీకి సమర్పిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు వెళ్లే ముందు ఆమె వాడిన ఫోన్లను ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకుని వెళ్లారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయల్దేరిన సమయంలో వాటిని ఎమ్మెల్సీ కవిత మీడియాకు చూపించారు. ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ ఫోన్లనే ఎమ్మెల్సీ కవిత ధ్వంసం చేశారని కొద్దిరోజులుగా ఈడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
#MLCKavitha | మూడోసారి ఈడీ విచారణకు హాజరైన కవిత.. వెళ్లేముందు ఫోన్లను మీడియాకు చూపించిన ఎమ్మెల్సీ pic.twitter.com/W3nsYjyGhH
— Namasthe Telangana (@ntdailyonline) March 21, 2023
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కవిత ఈ నెల 11న తొలిసారి ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు అయ్యారు. ఆమెను తిరిగి ఈ నెల 16న మరోసారి రావాలని ఈడీ ఆదేశించింది. ఈడీ నోటీసులకు సంబంధించి తాను సుప్రీం కోర్టులో పిటిషన్ వేశానని, అది ఈ నెల 24న విచారణకు రానున్నదని, సుప్రీం తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటానని ఆమె ఈడీకి తన ప్రతినిధి ద్వారా చెప్పారు. అదే సమయంలో ఈడీ అడిగిన అన్ని పత్రాలను సమర్పించారు. అనంతరం సోమవారం ఆమెను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులివ్వడంతో హాజరయ్యారు. విచారణ అనంతరం ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను తిరిగి మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈ నేపథ్యంలో మూడోసారి ఆమె ఈడీ ముందు హాజరయ్యారు.
సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత నుంచి రాత్రి 9.30 వరకు అధికారులు వివరాలు సేకరించారు. అయితే కవిత ఈడీ ఆఫీసుకు వచ్చిన తర్వాత గంటవరకు దర్యాప్తు అధికారులు ఆమెను ప్రశ్నించలేదని తెలిసింది. ఇతర నిందితుల సమక్షంలో ముఖాముఖి ప్రశ్నలు అడుగుతున్నట్టు ఈడీ అధికారులు బయటకు లీకులు వదిలినప్పటికీ.. కవితను మాత్రం ఇంతవరకు ఎవరితోనూ కన్ఫ్రంటేషన్ చేయలేదు. ఆమెను విడిగానే విచారించారు. అయితే మొత్తం 11 గంటల్లో కేవలం 14 ప్రశ్నలు మాత్రమే ఈడీ బృందం కవితను అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎక్కువ సమయం ఖాళీగా కూర్చోబెట్టినట్టు అర్థమవుతున్నది. స్పష్టమైన ఆధారాలేవీ లేకపోవడంతో మానసికంగా వేధించేందుకే ఈడీ అధికారులు ఇలా చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతున్నది. మద్యం పాలసీ కేసులో కవిత ప్రమేయానికి సంబంధించి ఏ ఒక్క అధారాన్నీ విచారణలో అధికారులు చూపెట్టలేకపోయారని సమాచారం. కేవలం రాజకీయ అంశాల చుట్టూ ఈడీ ప్రశ్నలు కొనసాగాయని తెలుస్తున్నది.
తాను ఎలాంటి తప్పూ చేయలేదని, చేయనని సోమవారం ఈడీ దర్యాప్తులో కవిత స్పష్టంచేశారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను దురుద్దేశంతో విచారిస్తున్నారని ఆమె ఈడీ అధికారులతో కుండబద్ధలు కొట్టారు. తాను పూర్తిస్థాయిలో విచారణకు సహకరిస్తున్నప్పటికీ.. సహాయ నిరాకరణగా చిత్రీకరించేందుకు ఈడీ కుట్ర పన్నుతున్నదని ఆమె ఆరోపించారు. విచారణలో పారదర్శకత లోపించిందని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనను విచారిస్తున్నట్లు తెలుస్తున్నదని కవిత నిలదీయగా.. ఈడీ అధికారులు మౌనంగా ఉండిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏ అక్రమాల్లోనూ తన పాత్ర లేకపోయినా కల్పిత కథలతో తనపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారని సమాచారం. తమ విశ్వసనీయత తమకు ఉన్నదని కవిత స్పష్టంచేశారు. ఈడీ విచారణలో పారదర్శకత లేదని పలుమార్లు తేల్చిచెప్పిన కవిత.. అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని విచారణ అధికారుల మొహం మీదే చెప్పినట్టు రాజకీయవర్గాలు తెలిపాయి.
సోమవారం నాటి విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను పలుమార్లు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఆమె ప్రశ్నలకు పలుమార్లు నీళ్లు నమిలిన అధికారులు.. ఎక్కువసార్లు మౌనంగానే ఉండిపోయారని సమాచారం. తనను నిందితురాలిగా పిలిచారా? అని విచారణ బృందాన్ని కవిత ప్రశ్నించగా.. వాళ్లు కాదు అని సమాధానమిచ్చారు. కేవలం అనుమానితురాలిగానే ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్పై ఈ నెల 24న విచారణ ఉండగా.. తనను అంత తొందరగా విచారించాల్సిన అవసరమేమిటని కవిత ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈడీ అధికారుల నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని సమాచారం. గత విచారణలో స్వాధీనం చేసుకున్న తన ఫోన్ను పూర్తిగా చెక్ చేసుకోవచ్చునని అధికారులకు తేల్చిచెప్పిన కవిత.. తాను ఫోన్లు ధ్వంసం చేసినట్టు మీడియాకు తప్పుడు లీకులు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. కవిత ప్రశ్నతో ఈడీ అధికారులు కంగుతిన్నారు.
ఈడీ విచారణను పూర్తిగా రికార్డు చేయాలని ఎమ్మెల్సీ కవిత అధికారులపై సోమవారం విచారణ సందర్భంగా ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీంతో ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేపట్టారు. విచారణ సందర్భంగా పలు ఈడీ కేసులపై కవిత అధికారులను ప్రశ్నించారు. బీజేపీలో చేరగానే మరుగునపడిన కేసుల గురించి ఆమె ప్రస్తావించడంతో అధికారులు మూగబోయారు. ‘గతంలో ఎంతోమందిపై విచారణ చేపట్టారు. బీజేపీలోకి రాగానే వారిపై ఎందుకు విచారణను ఆపేశారు? వారిపై పెట్టిన కేసులు ఏమైనయ్? ఇప్పటివరకు ఈడీ పెట్టిన కేసులెన్ని? వాటిలో దోషులుగా తేలినవి ఎన్ని?’ అని కవిత నిలదీసినట్టు సమాచారం. ఈ సందర్భంగా హిమంత బిశ్వశర్మ, సుజనాచౌదరి, నారాయణ రాణె కేసులను ఆమె ప్రస్తావించగా.. వాటిపైనా ఈడీ అధికారులు మౌనంగానే ఉండిపోయారని తెలుస్తున్నది.