హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ముఖ్యమైన మహిళా బిల్లు పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో 9 అంశాలను చర్చకు ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత సోనియాగాంధీ రాసిన లేఖలో మహిళా బిల్లు అంశం లేకపోవడమే దానికి నిదర్శనమని బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖలో మహిళా బిల్లు గురించి ఎందుకు ప్రస్తావించలేదని సోనియాను ప్రశ్నించారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశం కాదా అని నిలదీశారు.