ఆర్కేపురం, జూలై 9: బ్రాహ్మణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 75 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ బ్రాహ్మణులకు ఒక్క రూపాయి సాయం చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించిందని చెప్పారు. ఆదివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియం మైదానంలో నిర్వహించిన బ్రహ్మ గర్జన బహిరంగ సభకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బ్రాహ్మణులు ఎంతో అండగా నిలిచారని.. బడి బందు అన్ననాడే గుడి బందు పెట్టి ఉద్యమానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి వారిని తెలంగాణ ప్రభుత్వం మర్చిపోలేదని, వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదని పేర్కొన్నారు.
అర్చకులకు ప్రభుత్వ పరంగా జీతాలు ఇవ్వడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించినట్టు పేర్కొన్నారు. ధూపదీప నైవేద్యం కింద గతంలో రూ.2,500 ఇచ్చేవారని, తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలకు పెంచిందని వెల్లడించారు. ధూపదీప నైవేద్యం కింద గతంలో ఆరు వేల గుడులకు నిధులు ఇచ్చేవారని, ప్రస్తుతం దానికి 8వేల గుడులకు విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి రూ.2,242 కోట్ల నిధులు కేటాయించి వాటిని కాపాడుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టంచేశారు. యాదగిరిగుట్ట క్షేత్ర పునర్నిర్మాణానికి రూ.1200 కోట్లు, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి రూ.500 కోట్లు కేటాయించడంతో పాటు అనేక గుడులను అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని 1600 పైచిలుకు దేవాలయాలకు రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు కేటాయించినట్టు చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.
బ్రాహ్మణ విద్యార్థుల విదేశీ విద్యకు భరోసా
బ్రాహ్మణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ చదువుకోవాలనుకునే విద్యార్థులకు స్టడీ సర్కిల్స్లో చదువుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. విదేశీ విద్య చదువుకునేందుకు రూ.20 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న తొలి ప్రభుత్వం కేసీఆర్దేనని స్పష్టంచేశారు. ఈ పథకం కింద ఇప్పటికే 780 మంది పైచిలుకు విద్యార్థులు లబ్ధి పొందారని తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఐఐటీ, ఐఐఎంలో ఎంపికైన విద్యార్థులకు కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని పేర్కొన్నారు. రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగినవారు బ్రాహ్మణులని, ఎంత పెద్ద కింగ్ మేకర్ అయినా అందులో బ్రాహ్మణుల పాత్ర ఉంటుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలు చేసినప్పుడు తెలంగాణ జాగృతి ముందుండి పోరాడిందని గుర్తుచేశారు. బ్రాహ్మణులకు అత్యధిక అవకాశాలు ఇచ్చామని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధిని గ్రహించి సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
బ్రాహ్మణ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
దేశంలో ఎక్కడా లేనంతగా బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ బ్రాహ్మణుల వైపు చూసేవిధంగా బ్రాహ్మణులు తయారుకావాలని, అప్పుడే అవకాశాలు తమ గుమ్మం వరకు వస్తాయని అన్నారు. సీఎం కేసీఆర్ను మించిన ఆధ్యాత్మిక వేత్త దేశంలో ఎవ్వరూ లేరని చెప్పారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బ్రాహ్మణులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ పథకాల కోసం ఇతర రాష్ర్టాల్లో డిమాండ్
బ్రాహ్మణుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ర్టాల్లో అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణలో విప్రహిత భవనం ప్రారంభించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో తమకు అలాంటి భవనాలు కావాలని బ్రాహ్మణులు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. బ్రహ్మ గర్జన ద్వార తనకు విన్నవించిన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సభ ప్రారంభానికి ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మహిళలతో శ్రీలలితా-విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. బ్రహ్మ గర్జన చైర్మన్ వెన్నపంల్లి జగన్మోహన్శర్మ, వైస్ చైర్మన్ తులసి శ్రీనివాస్, కోశాధికారి మునిపల్లె శ్రీనివాస్ అధ్యతన జరిగిన ఈ సమావేశంలో సత్యానంద భారతీస్వామి, ఎమ్మెల్సీ వాణీదేవి, టీఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, శ్రీధర్బాబు, మాజీ ఎంపీ లక్ష్మీకాంతారావు, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ రమణాచారి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, రామ్మోహన్, పీవీ ప్రభాకర్రావు, దైవజ్ఞశర్మ, వక్కలంక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సభలో బ్రాహ్మణుల సంక్షేమం కోసం పలు తీర్మానాలు చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక పథకాలు: దేవీప్రసాద్
బ్రాహ్మణులందరూ ఐక్యతను ప్రదర్శించి బ్రాహ్మణ జాతికి ఉపయోగపడే విధంగా ఉండాలని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రాహ్మణుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటుతోపాటు బ్రాహ్మణుల కోసం 9 ఎకరాల స్థలం ఇచ్చి రూ.12 కోట్లతో బ్రాహ్మణ భవనాన్ని సీఎం కేసీఆర్ నిర్మించారని తెలిపారు. అర్చకులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి, వేతనాలను ఇచ్చి గౌరవిస్తున్నారని కొనియాడారు.