బోధన్ : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi) చుట్టపు చూపులా బోధన్(Bodhan) వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఇలానే తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి బిర్యాని తిని వెళ్లిపోవాలని సూచించారు. గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిందని, కానీ వాళ్లు ప్రతిసారి తెలంగాణను మోసం చేశారని మండిపడ్డారు. బోధన్ నియోజకవర్గంలోని నవీపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ఖు మద్దతుగా నిర్వహించిన రోడ్ షో(Roadshow)లో పాల్గొని మాట్లాడారు.
వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని, ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడూ శాంతి భద్రతల సమస్య, కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని, కానీ గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క శాంతి భద్రతల సమస్య రాలేదని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ప్రజలు ప్రశాంతగా జీవిస్తున్నారని చెప్పారు. ప్రశాంతగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
మంచి వాళ్లను ఎన్నుకుందామా లేదా ముంచేవాళ్లను ఎన్నుకుందామా అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. మూడు గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా లేదా 24 గంటలు కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా ? నిరంతరం నీళ్లు ఇచ్చే వాళ్లు కావాలా లేదా కన్నీళ్లు ఇచ్చేవాళ్లు కావాలా ? కర్నాటక డిప్యుటీ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ వచ్చి ఐదు గంటల కరెంటే ఇస్తామని చెప్తున్నారు. ఐదు గంటల కరెంటు కావాలా లేదా 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా ? రైతు బంధు కావాలా లేదా రాబంధు కావాలా ? అన్న అంశాలపై ఆలోచన చేయాలని కోరారు. రానున్న ఐదేళ్లలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతామని తెలిపారు. బోధన్ లో షకీల్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.