ధర్మపురి : తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగు బంధమని, కాంగ్రెస్ది అధికారం కోసం అహంకారమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )స్పష్టం చేశారు. కాంగ్రెస్కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి(Dharmapuri) బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి కవిత మహిళల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఎన్నికలు ఉన్నాయని ఇతర పార్టీల వాళ్లు అది ఇస్తాము అది ఇస్తామని వచ్చి మాటలు చెప్పి పోతారని, కానీ ప్రజలకు వారు ఏమీ చేయరని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశమిస్తే పెన్షన్ రూ. 200 ఇచ్చారని, రైతులకు పైసా ఇవ్వలేదని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, అనుబంధం శాశ్వతంగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని, ఏమీ లేని నాడు తెలంగాణ ఉద్యమం కొసం కొట్లాడినాడు కూడా ప్రజలతో ఉన్నామని, ఇప్పుడు కూడా ప్రజలతోనే ఉంటున్నామని అన్నారు. గత పదేళ్ల కాలంలో తెలంగాణ పచ్చబడిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ చెప్పింది చేసి చూపించారని అన్నారు.
రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పథకం అందని ఇళ్లు లేదని చెప్పారు. రాష్ట్రంలో మరో సారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే పెన్షన్లు రూ.5 వేలకు పెరుగుతుందని, ఎన్నికలు పూర్తయిన వెంటనే రూ.3 వేలకు పెరుగుతుందని, ఆ తర్వాత ఏటేటా పెరుగుతూ ఐదేళ్లకు రూ.5 వేలకు చేరుతుందని వివరించారు. కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని, సౌభాగ్య లక్ష్మి పథకం కింద పేద మహిళలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు.
మూడోసారి అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, దాంతో కోటి కార్డులకు చేరుతాయన్నారు. కేసీఆర్ మ్యానిఫెస్టో అంటే పైసలు ఇచ్చేటివి పెంచుడూ, సిలిండర్ ధర తగ్గించుడు అని పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సౌమ్యుడైన ఈశ్వర్ సీఎం కేసీఆర్ తో నిరంతరం చర్చిస్తూ ధర్మపురికి కావాల్సిన పని చేస్తారని అన్నారు.