హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): అదానీ, అతని కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు జరిపించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఆమె శాసనమండలి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని, అదానీ సంస్థల షేర్ల విలువలు పడిపోతున్నా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం దారుణమని వాపోయారు. అదానీతో పాటు ఎస్బీఐ, ఎల్ఐసీ వంటి సంస్థల షేర్ల విలువ భారీగా పడిపోతున్నదని, ఎందరో సామాన్యులకు తీవ్రనష్టం జరిగిందని తెలిపారు. రూ.3,600 ఉన్న అదానీ షేర్ విలువ ఇప్పుడు రూ.1400కు పడిపోయిందని, ఫలితంగా దాదాపు రూ.10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపద ఆవిరైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మోదీ మద్దతుతో అదానీ అనతికాలంలోనే లక్షల కోట్లకు ఎదిగారని, అపారమైన సంపదను కూడబెట్టిన విషయం ప్రపంచమంతా తెలుసని అన్నారు. అదానీ వ్యవహారంపై ఎవరు ప్రశ్నించినా అంతా బాగానే ఉన్నదని కేంద్ర ఆర్థిక మంత్రి, రిజర్వ్బ్యాంకు చెబుతుండటం దారుణమని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ మద్దతుతో అదానీ రూ. 60 వేల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారో అందరికీ తెలుసని కవిత వ్యాఖ్యానించారు.
ప్రజల ఆకాంక్షల పద్దు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. బడ్జెట్లో అగ్రభాగం ప్రజా సంక్షేమ పథకాలకు కేటాయించారు. దేశంలో రాష్ట్ర పోలీస్ శాఖకు చకటి పేరు ఉన్నదని, ఇందుకు అనుగుణంగా రూ.9,599 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. శాంతిభద్రతలు సమర్థవంతంగా నిర్వహించినప్పుడే అభివృద్ధి సాధ్యం-మహమూద్ అలీ, హోం మంత్రి
అద్భుతమైన బడ్జెట్
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా బడ్జెట్లో వైద్యానికి పెద్దపీట వేశారు. నిమ్స్ దవాఖానకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప విషయం. ఉద్యోగుల వేతనాలు, పరికరాలు, మందులు.. ఇలా అన్ని విభాగాలకు నిధులు కేటాయించడం చరిత్రాత్మకం. నిరుడితో పోల్చితే నిమ్స్కు 12.81 శాతం బడ్జెట్ పెంచారు.
-మార్త రమేశ్, నిమ్స్ అనుసంధానాధికారి