హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా బోధన్ దవాఖానలో ఈ నెల 21 నుంచి ప్రారంభించే అన్నదాన (బువ్వకుండ) కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావును ఆహ్వానించారు. ఎమ్మెల్యే షకీల్తో కలిసి మంగళవారం ఆమె మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వారు చర్చించారు.
మంత్రులు ఎర్రబెల్లి, కొప్పులతో కవిత భేటీ
నిజామాబాద్, బోధన్, జగిత్యాల నియోజకవర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయాల్లో సమావేశమయ్యారు. ఆమె వెంట ఎమ్మెల్యే షకీల్ తదితరులు ఉన్నారు.