MLC Kavitha | జుక్కల్ : ‘ఎన్నికలు వస్తున్నాయంటే చాలా మంది వచ్చి మాటలు చెబుతుంటారు. కానీ, చెప్పేటొళ్లు ఎవరు ? చెప్పింది చేసేటొళ్లు ఎవరనేది గుర్తుపట్టాలి. గతంలో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే తెచ్చుకోడానికి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మహ్మదాపూర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే హనుమంతు షిండేతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల గురించి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోంది కాబట్టే మరోసారి తమ పార్టీ అధికారంలోకి వస్తుందని బలంగా చెబుతున్నామన్నారు.
గతంలో ప్రభుత్వాలు వచ్చాయి.. పోయాయని.. ప్రజల కోసం పనిచేసిన సర్కారును చూడలేదన్నారు. మానవత్వం ఉన్న మనిషి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ప్రతీ ఇంటికి పథకాలు చేరుతున్నాయని స్పష్టం చేశారు. హనుమంతుడి గుడి లేని ఊరు ఉండదు.. కేసీఆర్ పథకం అందని ఇల్లు ఉండన్నది వాస్తమని చెప్పారు. ప్రతీ ఇంటికి మంచినీరు, 24 గంటల విద్యుత్, రైతుబంధు, పెన్షన్ తదితర అనేక పథకాలు వస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ ఖజానాకు ఒక పైసా వచ్చిందంటే అందులో సగం పేదవారికి పెట్టాల్సిందేనని బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని ప్రకటించారు.
రాష్ట్ర బడ్జెట్ రూ.2.9 లక్షల కోట్లుగా ఉంటే.. అందులో పెన్షన్లకే రూ.45వేలకోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగలేదని తెలిపారు. ప్రజల పట్ల ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ప్రజలు అడగకున్నా అన్నీ చేస్తున్నారన్నారు. అడగకున్నా ప్రజల అవసరాలను అంచనా వేసి అనేక కార్యక్రమాలను, పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. కొత్త మండలం కల నిజమైందని, కల సాకారమవడంలో స్థానిక ఎమ్మెల్యే హనుమంతు షిండే కృషి ఉందని తెలిపారు. కొత్త మండలం నేపథ్యంలో మంచి పనులు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించుకోడానికి సీఎం కేసీఆర్తో హనుమంతు షిండే చర్చించారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీల్లో షిండే పాత్ర మరింత ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో హనుమంతు షిండే భారీ మెజారిటీతో గెలుస్తారని స్పష్టం చేశారు.