హైదరాబాద్ : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. మహిళా దినోత్సవ సంబురాల్లో భాగంగా సోమవారం నగరంలోని లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం వారితో ముచ్చటించారు.
గౌరీశంకర్ కాలనీకి విచ్చేసిన ఎమ్మెల్సీ కవితకు కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు.
తెలంగాణాలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పెండ్లి జరిగినా ప్రభుత్వ సహకారం ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి రూ. 1,00,116 అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ మన్నే కవిత రెడ్డి పాల్గొన్నారు.