బోధన్, అక్టోబర్ 18: తెలంగాణలో ఎన్నికలు రావడంతో పొలిటికల్ టూరిస్టులు వస్తున్నారని, వారు రాష్ర్టానికి రావొచ్చు కానీ, ఇక్కడి సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టవద్దని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హితవు చెప్పారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో బుధవారం స్థానిక ఎమ్మెల్యే షకీల్తో కలిసి కవిత విలేకరులతో మాట్లాడారు. రాహుల్గాంధీ తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు.
‘నిజామాబాద్ జిల్లాలో పచ్చబడ్డ పొలాలను చూడండి.. మంచిగైన కాలువలను చూడండి.. నిండుకుండలా ఉన్న ఎస్సారెస్పీని చూడండి.. అంకాపూర్ చికెన్ రుచి చూడండి.. డిచ్పల్లి రామాలయాన్ని సందర్శించండి.. బోధన్కు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించండి.. అన్నీచూసి వెళ్లిపొండి. అంతేతప్ప మీరు, బీజేపీ నాయకులు పోటీపడి ఇక్కడ మతతత్వాన్ని రెచ్చగొట్టకండి’ అని ఆమె రాహుల్కు సూచించారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పటిష్ఠతను చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయని, అందుకే మొన్న ప్రధాని మోదీ నిజామాబాద్కు రాగా, ఇప్పుడు రాహుల్గాంధీ వస్తున్నారని కవిత పేర్కొన్నారు.
మతచిచ్చు పెట్టవద్దు
బీఆర్ఎస్ పాలనలో ఎక్కడా మత కలహా లు లేవని, అన్ని మతాలకు చెందినవారు శాం తి సామరస్యాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారని కవిత తెలిపారు. కాంగ్రెస్ హయాంలో సీఎంను మార్చాలనుకున్నప్పుడల్లా మత కలహాలు లేపేవారని గుర్తుచేశారు. గంగా జమునా తెహజీబ్ సంస్కృతిని నాశనం చేయవద్దని బీజేపీ, కాంగ్రెస్లను కోరారు.
విభజన హామీలపై రాహుల్ మాట్లాడారా?
పార్లమెంట్లో ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటును విమర్శిస్తూ మాట్లాడుతుంటే అక్కడే ఉన్న తల్లీకొడుకులు (సోనియాగాంధీ, రాహుల్గాంధీ) ఎందుకు అభ్యంతరం చెప్పలేదని కవిత ప్రశ్నించారు. విభజన హామీల గుంచి ఒక్కసారైనా పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాహుల్గాంధీ ముత్తాత నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన శ్రీరాంసాగర్ప్రాజెక్ట్ను టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేసుకున్నామని అన్నారు. తెలంగాణలో రైతులు, ప్రాజెక్టుల గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ నాయకులకు ఏమీలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ అంటే.. బీసీల ప్రభుత్వం
బీసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని, నేడు రాహుల్గాంధీ బీసీల కులగణన చేయాలనటం విచిత్రంగా ఉన్నదని కవిత ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే తాము బీసీలకు పెద్దపీట వేశామని, బీఆర్ఎస్ పార్టీ అంటే బీసీల ప్రభుత్వమని అన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో అధ్యయనం చేసి బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కొత్తగా ప్రవేశపెట్టిన కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి పథకాలతో ఇప్పటివరకు రైతుబీమా, కొన్ని రకాల పింఛన్లు అందనివారికి ఎంతో మేలు జరుగుతుందని కవిత తెలిపారు. అంతకుముందు బోధన్ 31వ వార్డుకు చెందిన పలువురు యువకులు స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కవిత పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.