MLC Kavitha | ఉద్యమం సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి దేశపతి శ్రీనివాస్, మాజీ ప్రభుత్వ సలహాదారు రమణాచారి, వకుళాభరణం కృష్ణమోహన్రావు, జూలూరి గౌరీ శంకర్, ఆయాచితం శ్రీధర్, తేలు విజయ, దేవీప్రసాద్, కవులు, కళాకారులు హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు, తెలంగాణ అస్థిత్వం తదితర అంశాలపై జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కవిత. అనంతరం కవిత మాట్లాడుతూ మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదని.. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారన్నారు.
తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందని.. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుందన్నారు. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అని.. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృధ్భావం ఎలా కనిపిస్తుంది ? అంటూ ప్రశ్నించారు. మన అస్థిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదని.. కానీ, అలాంటి ప్రయత్నాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం మనకు ఉందన్నారు. ఉనికి, సంస్కృతిపై దాడి జరుగుతుంటే మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదన్నారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పునర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి ఎక్కడా లేరన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని.. ఉద్యమకాలంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు.
ఉద్యమ సమయంలో నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని.. ఒక చేతిలో జొన్నకర్ర, మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు జాగృతి తరఫున వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు వాడే నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ అన్నింటిపై తెలంగాణ తల్లిని ముద్రించి పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ తల్లికి ఆరాధానతో కార్యక్రమం మొదలుపెట్టే సంప్రదాయాన్ని ఇక ముందూ కొనసాగిస్తామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి రూపొందించి.. ఆవిష్కరించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేశారు.