నిజామాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్లు రాసిచ్చి, పసుపు రైతులను అరవింద్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
ఈ మూడేండ్లలో పార్లమెంట్లో ఐదు సార్లు మాట్లాడిండు కానీ పసుపు బోర్డు, రైతుల గురించి మాట్లాడలేదని కవిత తెలిపారు. అరవింద్ను మూడేండ్లు విడిచి పెట్టినం.. ఇప్పుడు మాత్రం విడిచి పెట్టేది లేదు. ఢిల్లీలో మోకాళ్ల యాత్ర చేస్తరో.. మీ నాయకుల వద్ద మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకొని వస్తారో.. ఏం చేస్తరో చేయండి. కానీ బాండ్ పేపర్లో చెప్పినట్లు పసుపు బోర్డు పట్టుకొని రావాలి. లేదంటే తెలంగాణలో అడుగడుగునా నిలదీస్తాం, ప్రశ్నిస్తామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
ఈ మూడేండ్లలో నాలుకకు మడత లేకుండా అనేక అబద్ధాలు చెప్పారు అరవింద్ అని కవిత గుర్తు చేశారు. హైస్పీడ్లో అబద్ధాలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదు. రాజ్ నాథ్ సింగ్ నుంచి మొదలుకుంటే అరవింద్ వరకు చాలా అబద్ధాలు చెప్పారు. బీజేపీ అబద్ధాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విభజన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. గ్యాస్ సిలిండర్ల ధరల విషయంలో మహిళలను అవమానించేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. మన మేలు కోరుకోనటువంటి నాయకులను గుర్తించాలి. అరవింద్ మూడేండ్ల కిందట మాటిచ్చారు పసుపు బోర్డు తెస్తానని. పసుపు బోర్డు ఎప్పుడు తెస్తరు.. రైతులకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పసుపుకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఆ విషయం ఏమైందని కవిత నిలదీశారు.
నిజామాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. రైతులు పెద్ద ఎత్తున ఉన్నారని కవిత పేర్కొన్నారు. ఒక రాజకీయ రంగు పులిమి అనేక అబద్ధాలు చెప్పి.. బీజేపీ ఎంపీ సీటును గెలుపొందింది. కానీ నిజామాబాద్ ప్రజలకు, రైతులకు చేసిందేమీ లేదు. ఈ మూడేండ్లలో అనేక అబద్ధాలు చెప్పి రైతులను, ప్రజలను మోసం చేస్తున్నాడని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవాలను తెలియజేసేందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశానని కవిత స్పష్టం చేశారు. 2014 మేలో ఎన్నికైన తర్వాత జులై నుంచి 2018 జులై వరకు పసుపు బోర్డు కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించాను. నాటి వాణిజ్య శాఖల మంత్రి సీతారామన్, ప్రధాని మోదీకి అనేక లేఖలు రాసి అడిగామన్నారు. 2016, ఆగస్టు 25 నాడు నరేంద్ర మోదీని పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అడిగాం. 2017, మార్చి 24న పార్లమెంట్లో ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టామని తెలిపారు. 2017లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. 2017లో స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ని కూడా ప్రకటించారు. డివిజనల్ ఆఫీసును పెట్టడం జరిగింది. 2019లోపే ఇవన్నీ జరిగిపోయాయి. ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా పసుపు రైతులకు బాయిలర్లు కావాలని కేంద్రాన్ని కోరితే ఇవ్వలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బాయిలర్లు పంపిణీ చేశారని తెలిపారు.
నేనే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డివిజనల్ ఆఫీసులు తెచ్చానని అరవింద్ చెబుతున్నాడు. దాంతో పాటు పసుపు రైతులతో మాట్లాడి డ్రామా క్రియేట్ చేస్తున్నాడు. ఉచిత సలహాలు, ఉత్తుత్తి మాటలతో అరవింద్ టైం పాస్ చేస్తున్నారని కవిత కోపోద్రిక్తులయ్యారు. 2020-21లో స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా వచ్చిన బడ్జెట్ కోటి 18 లక్షలు.. 2021-22కు 74 లక్షలు వచ్చింది. ఈ సంవత్సరానికి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఈ మూడేండ్లలో కోటి 92 లక్షలు మాత్రమే తీసుకొచ్చారు. ప్రతి పసుపు రైతును మభ్య పెట్టి, బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేశాడు. పేరుకే సంగ్రామ యాత్రలు.. కానీ చేసేదేమీ ఉండదు. నిజమైన సంరక్షణ టీఆర్ఎస్ పార్టీ ద్వారానే లభిస్తుందని కవిత స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది స్థానాలు గెలుస్తామన్న విశ్వాసం ఉందన్నారు కవిత. ఒకప్పుడు కరువుతో కటకటలాడిన తెలంగాణలో నేడు విరివిగా పంటలు పండుతున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంతో నిరుద్యోగులు చదువులో బిజీ అయిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు కవిత.