హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఉద్యోగావకాశాల్లో మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన 33% వాటాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసి ఆడబిడ్డలకు అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు నష్టం చేకూర్చే జీవో 3ని రద్దు చేయకపోతే ఎంతవరకైనా పోరాటం కొనసాగిస్తామని, ఆడబిడ్డల హక్కులు హరిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. జీవో 3ని రద్దు చేసి ఉద్యోగావకాశాల్లో మహిళలకు 33% వాటా కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవో 3 కారణంగా ఇటీవల చేపట్టిన గురుకుల నియామకాల్లో ఆడబిడ్డలకు 12% వాటా కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు. జీవో 3ని వెనక్కి తీసుకునే వరకు స్ట్రీట్ఫైట్, లీగల్ఫైట్ చేస్తామని హెచ్చరించారు. త్వరలో గవర్నర్ను కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు.జీవో 41ను అమలుచేయాలని డిమాండ్ చేశారు. నియామకాల్లో హారిజంటల్ రిజర్వేషన్లు అమలుచేయాలని 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలని తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశించిన నేపథ్యంలో దానిని కేసీఆర్ ప్రభుత్వం అప్పీల్చేసిందని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం వేసిన కేసును రేవంత్ సర్కార్ ఫిబ్రవరి 6న ఉపసంహరించుకుని ఆడబిడ్డలకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నదని విమర్శించారు. రేవంత్రెడ్డికి ఓటుకు నోటు కేసుపై ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రజావాణిని పట్టించుకోని రేవంత్రెడ్డికి ఢిల్లీ వాణి మాత్రమే వినిపిస్తుందని ఎద్దేవా చేశారు.
ఆడబిడ్డలకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం
‘మీ సోనియా, ప్రియాంక పార్లమెంట్కు వెళ్లాలి. కానీ, తెలంగాణ ఆడబిడ్డలు ఉద్యోగాలకు దూరమై ఇంట్లో వంట చేసుకోవాలా? ఇదేం న్యాయం?’ అని కవిత ధ్వజమెత్తారు. ఉద్యోగాల్లో అన్యాయం జరిగిందని ఆడబిడ్డలు సీఎంను కలుద్దామని పోతే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘మేం చాకలి ఐలమ్మ, రాణీరుద్రమ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారసులం. నీతికి, న్యాయానికి కట్టుబడి మాట్లాడేటోళ్లం. అబద్ధాలు చెప్పి ఉద్యమాలు చేయలేదు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదు. నిజం చెప్పి ముందుకుపోతాం’ అని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు నిరుద్యోగులను ప్రచారానికి వాడుకుని ఈనాడు వారికి అన్యాయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. మహిళా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ అవలంబిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు జరిపిన నియామకాల్లో ఎంతమంది మహిళలకు ఉద్యోగాలు లభించాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాధారణంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు మహిళలు ఉత్సవాలు చేసుకుంటారని కానీ, తెలంగాణలో ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. గురుకులాల నియామకాల్లో దివ్యాంగులకు 4% రిజర్వేషన్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 108 ఉద్యోగులు, ఆశా వర్కర్ల, అంగన్వాడీలకు జీతాలు రావడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపినాథ్, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, దేవీప్రసాద్, రాజీవ్సాగర్, గజ్జల నగేశ్, గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.