మోతె, ఫిబ్రవరి 20: సంక్షేమ వసతి గృహ విద్యార్థినుల ఆత్మహత్యలపై రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి గురుకులాల పని తీరును సమీక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్లలో ఆస్మిత తల్లి జ్యోతిని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్తో కలిసి మంగళవారం ఆమె పరామర్శించారు. కవిత మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటనే సమీక్షించి ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల క్రితం భవనగిరి గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోగా.. సూర్యాపేట జిల్లా ఇమాంపేట పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు తనువు చాలించడం బాధాకరమని చెప్పారు.
విద్యార్థినులు పరీక్షల ఒత్తిడిలో ఉన్నారా? లేక మరేదైనా సమస్యలతో బాధపడుతున్నారా? అనే అంశాలపై ప్రభుత్వం ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? సిలబస్ బాగలేకనా? కౌన్సిలర్ల సంఖ్య తక్కువగా ఉన్నదా? సమయానికి నాణ్యమైన ఆహారం అందుతున్నదా? వంటి అంశాలపై సీఎం సమీక్ష చే యాని డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆత్మహత్యల ఘటనల్లో దర్యాప్తు ముందుకు సాగడం లేదని, విద్యాశాఖకు మంత్రిని నియమించే దిశగా సీఎం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. బాధిత కు టుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆస్మిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఆస్మిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంధ్యను హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే హరీశ్రావు, కవిత కలిసి పరామర్శించారు. ఇటీవల సంధ్య భర్త మృతిచెందిన విషయం తెలిసిందే.