నిజామాబాద్: పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే ఏర్పాటు ప్రకటించిన విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని బీజేపీ కార్యక్రమంలా చేశారని మండిపడ్డారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా, ప్రొటోకాల్ పాటించకుండా కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారని విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నిజామాబాద్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పసుపుబోర్డు ఏర్పాటుపై మీడియాతో మాట్లాడారు. 2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు పసుపు బోర్డు గురించి లేఖ రాసినట్లు గుర్తుచేశారు. ప్రధాని మోదీని రెండు సార్లు కలిశానని చెప్పారు.
పసుపు బోర్డుకు ప్రయత్నం చేస్తేనే పసుపు ఆధారంగా రావాల్సిన పరిశ్రమల కోసం కృషి చేశాన్నారు. పసుపుకు రూ.15 వేల మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశానని తెలిపారు. ఐదేండ్లు ఎంపీగా త్రిముఖవ్యూహంతో అలుపెరగని పోరాటం చేశానని పేర్కొన్నారు. కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదని, మద్ధతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని స్పష్టం చేశారు. ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి అవుతుందని, దాంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. పసుపు దిగుమతులను నియంత్రించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నానని వెల్లడించారు. 2014లో 8 లక్షల క్వింటాళ్లు దిగుమతవుతే.. ఇప్పుడది రెట్టింపయ్యింది చెప్పారు. ఏటేటా దిగుమతులు పెరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేవలం రాజకీయం కోసం పసుపు బోర్డు కాకపోతే.. వెంటనే దిగుమతులపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేశారు. వెంటనే పసుపుకు రూ.15 వేల మద్ధతు ధర ప్రకటించాలన్నారు.
‘ఎంపీ అర్వింద్కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటే. తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి ఆయన అసలు రాజకీయాల్లోనే లేరు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రిచాటు బిడ్డగా ఉన్నారు. ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్పై రాసిచ్చిన అర్వింద్.. గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుటుందన్నారు. తాము కేంద్రంపై పదేపదే ఒత్తిడి చేయడంతోనే ఆ స్పైసెస్ బోర్డు కార్యాలయం ఏర్పాటైంది. అది కూడా ఆయన గొప్పతనమని అర్వింద్ మాట్లాడడం హాస్యాస్పదం. స్పైసెస్ బోర్డు బెంజ్ కారులాంటిది.. పసుపు బోర్డు అంబాసిడర్ కారులాంటిదని అర్వింద్ అన్నారు. ఒకవేళ బెంజ్ కారు ఉంటే.. అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్లు?. ఎందుకు ఇంత వైరాధ్యంతో రకరకాల మాటలు చెబుతున్నారు?. ఎంపీ అర్వింద్ గాలి మాటలు మాట్లాడడం మానేయాలి. ఎవరు ఏం చేయకున్నా ప్రతి మూడో సంవత్సరం పసుపు ధర పెరుగుతుంది. కానీ అది తన ఘనత అని అర్వింద్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది.
రైతాంగాన్ని బీజేపీ మోసం చేయడం ఆపేయాలి. స్పైసెస్ పార్కు ఏర్పాటుకు వేల్పూర్ వద్ద కేసీఆర్ ప్రభుత్వం 42 ఎకరాలు కేటాయించారు. ఆ పార్కులో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. జాక్రాన్పల్లిలో విమానాశ్రయానికి కేసీఆర్ ప్రభుత్వం 800 ఎకరాలు సేకరించింది. అక్కడ ఎయిర్ పోర్టు తీసుకురావాలని’ ఎంపీ అర్వింద్ను కవిత డిమాండ్ చేశారు.
LIVE : Addressing the media at Nizamabad https://t.co/UajJ15kbVU
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 19, 2025