నిజామాబాద్: ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు. స్వల్పకాలంలో రాష్ట్ర గతినే మార్చే ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రిని.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్లోని న్యూ అంబేద్కర్ భవన్లో సాగునీటి దినోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం (Kaleshwaram) గురించి గర్వంగా చెప్పుకోవాలన్నారు. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు.
కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఇక్కడి వ్యక్తి పనిచేశారు. కానీ అప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి.. ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. కాలువలు తవ్వి రూ.వేల కోట్లు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సీఎం కేసీఆర్ హయాంలో జిల్లా నీటిపారుదల రంగానికి రూ.5 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. పారదర్శక పాలన ఉంది కాబట్టే 21 రోజులపాటు ప్రతీ శాఖలో సాధించిన ప్రగతిని వివరిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంత బాధ పడేవారో ఒక బిడ్డగా నాకు తెలుసునని వెల్లడించారు.
కాళేశ్వరంతో ఎక్కువ లబ్దిపొందుతున్నది నిజామాబాద్ (Nizamabad) జిల్లాయేనని తెలిపారు. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడిదుంకుతున్నాయంటే దాని వెనుక కేసీఆర్ శ్రమ ఎంతో ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణం అంటే అది భగీరథ ప్రయత్నం అని తెలిపారు. జిల్లాలో కాళేశ్వరం ద్వారా లక్ష 80 వేల ఎకరాలకు సాగునీరు అందించుకుంటున్నామని చెప్పారు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక ఇంజినీర్ల సంఖ్యను పెంచుకొని.. ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాలను పటిష్ట పర్చుకున్నామని చెప్పారు. అందుకే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో 15 శాతం భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో జరిగిన సాగు నీటి దినోత్సవంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారితో కలిసి పాల్గొనడం జరిగింది #TelanganaTurns10 #తెలంగాణదశాబ్దిఉత్సవాలు pic.twitter.com/WIU4KsnEJi
— Kavitha Kalvakuntla (@RaoKavitha) June 7, 2023