హైదరాబాద్: బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కు కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. బయ్యారంలో లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని చెనప్పారు. అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
కేంద్రంలో పదేండ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని వెల్లడించారు. ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిస్తున్నదని విమర్శించారు. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ను ఛత్తీస్గఢ్ నుంచి తీసుకువచ్చేందుకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. బీజేపీకి తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరమన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోఛనీయమని విమర్శించారు. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని, ఇప్పుడు మాత్రం మాట్లాడటం లేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించాలన్నారు.