నిజామాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు దేశంలోని కీలకమైన అంశాలపై కాంగ్రెస్ వైఖరేమిటో ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఏ వైఖరీ లేని ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం హైదరాబాద్ వస్తున్న గాంధీ పరివారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై తక్షణం అభిప్రాయాన్ని తెలియజేయాని డిమాండ్ చేశారు. గురువారం నిజామాబాద్లో పలు జాతీయ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ వేగాన్ని రాహుల్గాంధీ అందుకోలేరని అన్నారు. కేంద్రంలో మోదీని రాహుల్గాంధీ ఆపలేకపోతున్నందునే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా మారిందని పేర్కొన్నారు.
రాజస్థాన్లో అదానీతో దోస్తీ నిజం కాదా?
అన్ని ముఖ్యమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నదని కవిత మండిపడ్డారు. లఢక్ వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ అదానీని విమర్శించారని, అదే విమర్శలను రాజస్థాన్లో చేయగలరా అని ఆమె సవాల్ చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం అదానీతో కలిసి ప్రాజెక్టులు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. ఛత్తీస్గఢ్లో ఆదివాసీల ఆందోళనతో అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. డిక్లరేషన్ల పేరిట తెలంగాణలో హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ గత 60 ఏండ్లలో ఎందుకు వాటిని అమలు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను తిరసరించడానికి సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు.
మోదీ ఇంటి ముందు కిషన్రెడ్డి దీక్షచేయాలి
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, ఆ హామీ అమలు కోసం దీక్ష చేయాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కవిత సూచించారు. కిషన్రెడ్డి దీక్ష చేయాల్సింది హైదరాబాదులో కాదని, ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీనివాసం ముందు అని ఆమె ఎద్దేవా చేశారు.