హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభు త్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనే ఈ రిజర్వేషన్లను అమలుచేయాలని కోరారు. రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి సుదీర్ఘకాలం వాయిదా వేయటం వెనుక కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్ర దాగి ఉన్నదని ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్లను తక్షణం అమలుచేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మరో పోరాటం చేస్తామని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం భారత్ జాగృతి తరఫున న్యాయపోరాటం చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టులో ఈ అంశంపై పెండింగ్లో ఉన్న పిటిషన్లో ఇంప్లీడ్ అవుతామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం, పార్లమెంటులో బిల్లును పాస్ చేసిందని చెప్పారు. చట్టం ఆమోదం పొందిన తర్వాత దాని అమలును వాయిదా వేయటం ఏమిటని మండిపడ్డారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయని చెప్పారు. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నదని, వాటిల్లో భారత్ జాగృతి తరపున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు.