హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) శ్రీశైలం/అచ్చంపేట/డిండి: అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన శక్తిపీఠం శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామిని ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త అనిల్ దంపతులు శనివారందర్శించుకున్నారు. ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వీరికి అర్చక, వేదపండితులు తిలకధారణ చేశారు. అధికారులు పూలమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లన్నకు గర్భాలయంలో పంచామృతాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. అనంతరం కవిత దంపతులకు వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రం, ఙ్ఞాపికను అందజేశారు. ఎమ్మెల్సీ కవితతోపాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, టీఆర్ఎస్, జాగృతి నాయకులు, కార్యకర్తలు దర్శించుకున్నారు. ఉభయ తెలుగు రాష్ర్టాలు సుభిక్షంగా ఉండాలని పూజలు చేసినట్టు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రానికి తెలంగాణ ప్రజలకు మధ్య ఆధ్యాత్మిక అవినాభావ సంబంధం ఉన్నదని కవిత పేర్కొన్నారు. శ్రీశైలం సన్నిధికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నిసార్లు అమ్మవారిని దర్శించుకున్నా తనివి తీరదని చెప్పారు. శ్రీశైలం క్షేత్రం దినదిన ప్రవర్ధమానవుతున్నదని, తిరుపతి మాదిరిగా శ్రీశైలం క్షేత్రం ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. శ్రీశైలం దర్శనానికి వెళుతున్న ఎమ్మెల్సీ కవితకు కల్వకుర్తి వద్ద తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టీఆర్ఎస్ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆమె మార్గమధ్యలో నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టును సందర్శించారు.
8 దేశాల్లో బతుకమ్మ వేడుకలు.. పోస్టర్ల ఆవిషరణ
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో ఆదివారం నుంచి జరుగనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్లను జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆవిషరించారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో యూకే, ఖతర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కువైట్, దుబాయ్, స్విట్జర్లాండ్ దేశాలతోపాటు ముంబైలో జరిగే బతుకమ్మ వేడుకల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. తెలంగాణ జాగృతి ఖతర్, తెలంగాణ జాగృతి న్యూజిలాండ్శాఖ ఆధ్వర్యంలో రూపొందిన బతుకమ్మ ప్రొమోలను ఆమె ఆవిషరించారు. కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి వివిధ దేశాల శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.